NRI News : అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత.. సాయిచరణ్ చనిపోయిన వారానికే..
అమెరికాలో భారత సంతతి వ్యక్తిని కాల్చివేసిన సంఘటన మరొకటి చోటు చేసుకుంది.
న్యూయార్క్, జూన్ 27: భారత సంతతికి చెందిన ఓ 31 ఏళ్ల యువకుడు తన ఇంటికి సమీపంలో పార్క్ చేసి ఉన్న ఎస్యూవీ కార్లో కూర్చుని ఉండగా దుండగులు కాల్చిచంపారు. మేరీలాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కాల్పులకు గురైన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
సత్నామ్ సింగ్ శనివారం సాయంత్రం 3.46 గంటల సమయంలో సౌత్ ఓజోన్ పార్క్ సెక్షన్ ఆఫ్ క్వీన్స్ వద్ద కార్లలో కూర్చుని ఉండగా మెడపై, శరీరంలోని ఇతర భాగాలపై కాల్పులకు గురై చనిపోయి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారని తాజా ఘటనపై న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది.
తన స్నేహితుడి నుంచి తెచ్చుకున్న నలుపు రంగు జీప్ రాంగ్లర్ సహారాలో సత్నామ్ సింగ్ కూర్చుని ఉండగా గన్తో ఉన్న ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు.
సింగ్ను వెంటనే అక్కడి నుంచి జమైకా హాస్పిటల్ తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
దుండగుడు కాలినడకన సింగ్ కూర్చున్న కార్ వద్దకు వచ్చి కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలపగా, స్థానికులు మాత్రం ఓ సిల్వర్ కలర్ సెడాన్ కార్ నుంచి కాల్పులు జరిపినట్టు చెప్పారు.
‘సింగ్ 129వ స్ట్రీట్లో కారు వైపు వెళుతుండగా.. మరొక కార్ వచ్చింది. ఆ కారులో దుండగుడు ఉన్నాడు..’ అని స్థానికురాలు జోన్ కాపెలాని తెలిపారు.
‘ఆ కారు యూ-టర్న్ తీసుకుని వస్తూనే కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తరువాత తిరిగి 129వ స్ట్రీట్లోకి వెళ్లిపోయింది..’ అని ఆమె తెలిపారు.
కాల్పుల ఘటన ఆమె ఇంటి సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్ పోలీస్ విభాగం వాటిని పరిశీలిస్తోందని ఆమె తెలిపారు.
దుండగుడు సింగ్ను చంపాలనుకున్నాడా లేక ఎస్యూవీ ఓనర్ను చంపాలనుకున్నాడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మేరీలాండ్లోని బాల్టిమోర్ ప్రాంతంలో తెలంగాణ యువకుడు, 25 ఏళ్ల సాయిచరణ్ను కాల్చిచంపిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. జూన్ 19న ఈ ఘటన జరిిన వెంటనే ఆస్పత్రికి తరలించగా, సాయి చరణ్ అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు.