కెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
హరియాణాలో 12వ తరగతి పూర్తి చేసిన వంశిక, ఆ తర్వాత కెనడాకు వెళ్లింది. అక్కడ రెండేళ్ల హెల్త్ డిప్లొమా కోర్సు చేసింది. కాగా ఏప్రిల్ 18న ఫైనల్ పరీక్షలు పూర్తవ్వడంతో ఒట్టావాలోని ఒక కాల్ సెంటర్లో పార్ట్-టైమ్లో చేరింది. ఏప్రిల్ 22న ఉద్యోగం కోసం బయలుదేరిన ఆమె, తిరిగి ఇంటికి వెళ్లలేదు!
ఆమె మృతదేహం బీచ్లో కనిపించిందని అధికారులు చెప్పారు.
"ఒట్టావాలో భారతదేశానికి చెందిన వంశిక సైని అనే విద్యార్థిని మరణించినట్లు తెలియగానే మేము చాలా బాధపడ్డాము. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు, స్థానిక కమ్యూనిటీ అసోసియేషన్లతో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాము," అని ఏప్రిల్ 29న భారత రాయబార కార్యాలయం ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది.
21ఏళ్ల వంశిక ఏప్రిల్ 25న ఐఈఎల్టీఎస్ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ ఆమె పరీక్ష రాయలేదు.
వంశిక సైని తండ్రి పేరు దేవిందర్ సైని. ఆయన ఛండీగఢ్లోని డేరా బస్సిలో నివాసముంటున్నారు. దేవిందర్ స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నేత. ఆ పార్టీ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రంధావాకు సన్నిహితుడు.
తన కూతురు రోజూ తమతో మాట్లాడేదని, కానీ ఏప్రిల్ 22 తర్వాత ఫోన్ కూడా చేయలేదని రంధావా వెల్లడించారు. ఆమె కనిపించడం లేదని ఏప్రిల్ 25న తనకు తెలిసినట్టు వివరించారు. ఆ తర్వాత.. ఆమె మృతదేహం బీచ్లో కనిపించినట్టు పోలీసులు చెప్పారని వెల్లడించారు. అయితే, కూతురి హత్య వెనుక కుట్ర కోణం ఉండి ఉండొచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
కెనడాలో భారతీయులపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోయాయి. ఒంటారియో హామిల్టన్లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న 21 ఏళ్ల హర్ సిమ్రత్ రాంధవా అనే విద్యార్థిని.. ఇటీవలే బస్స్టాప్లో వేచి ఉండగా అటుగా వెళ్తున్న కారు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రంధావా మరణించింది.
హర్ సిమ్రత్ రాంధవా ఛాతీలో దెబ్బ తగలడంతో మృతిచెందిందని, సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని అధికారులు చెప్పారు.
పంజాబ్ వాసి విధులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 16 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధుల్లో కాల్పులు జరిగాయి. అమాయకురాలైన ఆమె ప్రాణాలు కోల్పోయింది.
“హామిల్టన్లో భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ రాంధవా విషాదకరమైన మరణం పట్ల మేము తీవ్రంగా చింతిస్తున్నాము. ఆమె కుటుంబంతో మాట్లాడుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మేము ప్రార్థిస్తున్నాము. బాధిత కుటుంబానికి అండగా ఉంటాము,” అని టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 18న ఒక పోస్ట్లో పేర్కొంది.
సంబంధిత కథనం