విషాదం! పాకిస్థాన్​ షెల్లింగ్​లో భారత ఆఫీసర్​ మృతి-indian officer dies as pakistani shelling hits his home in jammu kashmir rajouri ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  విషాదం! పాకిస్థాన్​ షెల్లింగ్​లో భారత ఆఫీసర్​ మృతి

విషాదం! పాకిస్థాన్​ షెల్లింగ్​లో భారత ఆఫీసర్​ మృతి

Sharath Chitturi HT Telugu

జమ్ముకశ్మీర్​లోని రాజౌరీలో పాక్ షెల్లింగ్​ వల్ల ఓ భారత అధికారి మృతి చెందారు. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.

పూంచ్​లోని ఓ గ్రామంలో పరిస్థితి.. (HT_PRINT)

సరిహద్దులో భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్​ షెల్లింగ్​కి జమ్ముకశ్మీర్​ అడ్మినిస్ట్రేషన్​ సర్వీసెస్​ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీలోని తన నివాసంపై శనివారం తెల్లవారుజామున పాక్​ జరిపిన కాల్పుల్లో ఆయన మరణించాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్​కు చెందిన అంకితభావం కలిగిన అధికారిని కోల్పోయామని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పేరు రాజ్​ కుమార్​ థప్పా అని తెలిపారు.

"ఈ రోజు ఆ అధికారి నివాసంపై పాక్ షెల్లింగ్ జరిగింది. అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాప్పాను చంపారు," అని అబ్దుల్లా చెప్పారు.

“నిన్ననే డిప్యూటీ సిఎంతో కలిసి ఆయన జిల్లా అంతా తిరిగారు. నా అధ్యక్షతన జరిగిన ఆన్​లైన్ సమావేశానికి హాజరయ్యాడు. ఈ భయంకరమైన ప్రాణ నష్టం పట్ల దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేయడానికి కూడా నాకు మాటలు లేవు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి,” అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

రాజౌరీ పట్టణంలోని ఆయన నివాసంపై ఆర్టిలరీ షెల్ దాడి జరగడంతో రాజౌరీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్​కుమార్ థాప్పా, ఆయన ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని తొలుత వార్తలు వచ్చాయి.

వారిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. తీవ్ర గాయాలపాలైన థాపా మృతి చెందగా, సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

రాజౌరీ ప్రాంతంలో శనివారం జరిగిన వరుస పేలుళ్లలో అనేక ఇళ్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి.

26 ప్రాంతాలపై పాక్​ దాడి- తిప్పి కొట్టిన భారత్​..

తాజా అప్డేట్స్​ ప్రకారం.. శుక్రవారం రాత్రి- శనివారం తెల్లవారుజామున ప్రాంతంలో జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్​లోని 26 ప్రాంతాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత్​ సమర్థవంతంగా తిప్పికొట్టింది. కాగా పంజాబ్​లోని ఫిరోజ్ పూర్ పట్టణంలో నిన్న రాత్రి సాయుధ డ్రోన్ దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు.

శ్రీనగర్, జమ్ము, రాజౌరీ సహా జమ్ముకశ్మీర్ లోని పలు నగరాల్లో శనివారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. న్యూస్​ కవరేజీలో ఉన్న రిపోర్టర్లకు పేలుడు శబ్దాలు వినిపించాయి.

కాగా పాకిస్థాన్​ చర్యలను తిప్పికొట్టేందుకు శుక్రవారం-శనివారం అర్ధరాత్రి భారత్ కూడా మూడు పాక్ వైమానిక స్థావరాలపై దాడి చేసినట్టు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్​లోని మురిద్, ఝాంగ్​లోని రఫీఖీ వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.