హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడైనా పాకిస్థాన్పై దాడి చేయవచ్చునని అన్నారు. రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో పాక్ బలగాల మోహరింపును పెంచిందని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టుగా చెప్పారు. పాక్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటన పాక్లో కలకలం రేపింది.
గతవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. పాకిస్థాన్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. దాడికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందని భారతదేశం ఆరోపించింది. పాకిస్థాన్ ఆ ఆరోపణను తిరస్కరించింది. అయితే తాజాగా భారత్ చర్యలపై పాక్ రక్షణ మంత్రి స్పందించారు. మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఇస్లామాబాద్లోని తన కార్యాలయంలో రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
'ఇప్పుడు మా బలగాలను బలోపేతం చేశాం. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ఆ నిర్ణయాలు తీసుకున్నాం. భారత్ దూకుడు పెరుగుతోందని, దాడి జరిగే అవకాశం ఉందని పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించింది. పాకిస్థాన్ అప్రమత్తంగా ఉంది. మన ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితేనే అణ్వాయుధాలను ప్రయోగిస్తాం.' అని ఆసిఫ్ చెప్పారు.
భారత దాడి జరిగే అవకాశం గురించి పాకిస్థాన్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని ఆసిఫ్ అన్నారు. చొరబాటు తప్పదని ఎందుకు అనుకుంటున్నారో మరిన్ని వివరాలలోకి వెళ్ళలేదు. పాకిస్థాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని చెప్పారు.
ఉగ్రవాదుల కోసం భారత్ భారీ గాలింపు చర్యలు చేపట్టింది. వారిలో ఇద్దరు పాకిస్థానీలుగా భారతదేశం గుర్తించింది. పాకిస్థాన్ దీనిని తిరస్కరించింది. తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చింది. దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, ప్రధాన భూ సరిహద్దు క్రాసింగ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయులకు వీసాలను ఉపసంహరించుకుంది. అనేక నిర్ణయాలు తీసుకుంది. రెచ్చగొట్టే కంటెంట్ ఉందనే కారణంతో డజనుకు పైగా పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్లను భారత ప్రభుత్వం నిషేధించింది.