'ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోండి..' భారతీయులకు సూచన!
Indians in Ukraine | రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో.. ఉక్రెయిన్లోని భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు ఇచ్చింది. అవసరమైతే తప్ప ఉక్రెయిన్లో ఉండకూడదని.. ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
Russia Ukraine conflict | ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ ఆదివారం కీలక సూచనలు జారీ చేసింది. అవసరమైతే తప్ప.. ఉక్రెయిన్లో ఉండకూడదని, తాత్కాలికంగా విడిచిపెట్టి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యా, నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత ఎంబసీ ఈ విధంగా సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్రెండింగ్ వార్తలు
"ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అనిశ్చితి కారణంగా, దేశంలో ఉండాల్సిన అవసరం లేని భారతీయులు, విద్యార్థులు.. ఉక్రెయిన్ను తాత్కలికంగా విడిచిపెట్టి వెళ్లిపోవాలని సూచిస్తున్నాము. విద్యార్థులు, తమతమ కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరిపి, ఫ్లైట్ల వివరాలు తెలుసుకోవాలి. ఈ ఎంబసీ ఫేస్బుక్, ట్విట్టర్, వెబ్సైట్లను ఫాలో అవ్వాలి," అని భారతీయ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
2020 లెక్కల ప్రకారం.. ఉక్రెయిన్లో 18వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
యుద్ధం అనివార్యమా..
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరగొచ్చు అనే సంకేతాలు నానాటికి బలపడుతున్నాయి. తాజాగా.. సరిహద్దు వెంబడి కాల్పుల మోత మోగింది. ఉక్రెయిన్ సైనికులు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులు.. ఆదివారం ఒకరిపై ఒకరు మోటార్ షెల్స్తో దాడి చేసుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భీకర శబ్దాల కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమపై దాడి చేశారన్న ఆరోపణలతో.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నాయి. ఈ తరుణంలో సరిహద్దు వెంబడి కాల్పులు జరుగుతుండటంపై సర్వత్రా ఆందోనళ నెలకొంది.
ఉక్రెయిన్ను రష్యా ఇప్పటికే మూడు వైపులా చుట్టుముట్టింది. 1.5లక్షల మంది సైనికులు, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్కు సమీపంలోని బెలారస్లో శనివారం మిలిటరీ విన్యాసాలు చేపట్టింది రష్యా. దీంతో ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రంగా మారింది. కాగా.. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగితే.. రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తామని.. ఆమెరికా సహా అనేక దేశాలు ఇప్పటికే తేల్చిచెప్పాయి.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ.. పరిస్థితులను శాంతిపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దౌత్యపరంగానే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. సంక్షోభానికి ముగింపు పలికేందుకు.. కలిసి పనిచేద్దామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెప్పారు. సమావేశానికి సంబంధించిన వేదికను సైతం పుతిన్ చెప్పాలని కోరారు. అయితే.. జెలెన్స్కీ పిలుపును రష్యా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై రష్యా ఇంకా స్పందించకపోవడమే ఇందుకు కారణం.
కొన్నేళ్ల పాటు తీవ్రంగా ఉన్న రష్యా- ఉక్రెయిన్ వివాదం.. కొన్ని నెలలుగా మరింత ముదిరింది. నాటోలో చేరాలని ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా మండిపడింది. నాటోలో ఉక్రెయిన్ చేరితే, ఆ దేశంపై ఆధిపత్యం చెలాయించడం కష్టమని భావించి.. వివాదాన్ని తీవ్రతరం చేసింది! సరిహద్దుకు లక్షలాదిమంది బలగాలను, ఆయుధాలను పంపింది.
ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బైడెన్ సహా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. అవి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి.
అయితే తమకు దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా పదేపదే చెబుతూ వస్తోంది. ఈ తరుణంలోనే.. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కాగా.. ఇతర దేశాలు రష్యా మాటలను విభేదిస్తున్నాయి. రష్యా చెప్పినట్టు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నాయి. ఏ క్షణంలోనైనా దాడి జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. రష్యా మాత్రం.. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది.
సంబంధిత కథనం