ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 379 ఖాళీలను భర్తీ ఇండియన్ ఆర్మీ చేయనుంది. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుకు (Short Service Commission course) అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 14.
ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన లేదా ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 01 ఏప్రిల్ 2025 నాటికి అన్ని సెమిస్టర్లు / సంవత్సరాల మార్కుల షీట్లతో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును సమర్పించగలగాలి. ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో శిక్షణ ప్రారంభించిన తేదీ నుండి 12 వారాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాలి. అలాగే, ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే విద్యార్థుల వయస్సు ఏప్రిల్ 1, 2025 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే వారు 02 ఏప్రిల్ 1998 నుంచి 01 ఏప్రిల్ 2005 మధ్య జన్మించి ఉండాలి. ఇండియన్ ఆర్మీలోని ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే విధి నిర్వహణలో మరణించిన భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది వితంతువులు.. వారి విద్యార్హతలు, వయోపరిమితి వివరాలను joinindianarmy.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
దరఖాస్తులను కటాఫ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సెంటర్ కేటాయింపును అభ్యర్థికి ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. సెంటర్ కేటాయించిన తరువాత, అభ్యర్థులు తమ ఎస్ఎస్బీ తేదీలను ఎంచుకోవాల్సి ఉంటుంది, ఇవి ఫస్ట్ కమ్, ఫస్ట్-సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. స్టేజ్ 1లో ఉత్తీర్ణులైన వారు స్టేజ్ 2కు వెళ్తారు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్/సబ్జెక్టుకు మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ (Indian Army) అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.