డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు నగరాల్లో ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం చేసిన అనేక ప్రయత్నాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని అధికారులు ధృవీకరించారు. ప్రతీకార చర్యలో భారత దళాలు పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లోని రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయి.
భారత్ లోని అవంతిపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్ లై, భుజ్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం దాడులు చేసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు విఫలయత్నం చేసిందని తెలిపింది. ఈ దాడుల అవశేషాలను ప్రస్తుతం పలు చోట్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఇది పాక్ దురాక్రమణకు స్పష్టమైన ఆధారాలను అందిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
దీనికి దీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు ఈ ఉదయం పలు పాక్ ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ దాడులతో సమానమైన తీవ్రతతో భారత్ ప్రతిస్పందనను అదే ఆపరేషనల్ డొమైన్ లో నిర్వహించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ఈ రోజు ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్ లోని అనేక ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ తో సమానంగా భారత్ కూడా అదే స్థాయిలో స్పందించింది. లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది" అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
జమ్మూకశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, యూరి, పూంచ్, మెంధర్, రాజౌరీ తదితర సెక్టార్లలో మోర్టార్లు, భారీ ఫిరంగులను ప్రయోగిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు గణనీయంగా పెరిగాయని మంత్రిత్వ శాఖ నివేదించింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, పాకిస్తాన్ నుంచి మోర్టార్, ఆర్టిలరీ దాడులను నిలిపివేసేందుకు భారత్ స్పందించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం