అమృత్ సర్, శ్రీనగర్, ఇతర నగరాలు లక్ష్యంగా దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం-india thwarts pak military attempt targeting srinagar amritsar other cities ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అమృత్ సర్, శ్రీనగర్, ఇతర నగరాలు లక్ష్యంగా దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం

అమృత్ సర్, శ్రీనగర్, ఇతర నగరాలు లక్ష్యంగా దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం

Sudarshan V HT Telugu

ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా భారత్ లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ విజయవంతంగా అడ్డుకుంది. మరోవైపు, భారత్ పాక్ ప్రధాన నగరం లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాక్ దాడులు

డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు నగరాల్లో ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం చేసిన అనేక ప్రయత్నాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని అధికారులు ధృవీకరించారు. ప్రతీకార చర్యలో భారత దళాలు పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లోని రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయి.

ఈ నగరాలపై దాడులకు ప్రయత్నం

భారత్ లోని అవంతిపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్ లై, భుజ్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం దాడులు చేసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు విఫలయత్నం చేసిందని తెలిపింది. ఈ దాడుల అవశేషాలను ప్రస్తుతం పలు చోట్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఇది పాక్ దురాక్రమణకు స్పష్టమైన ఆధారాలను అందిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీటుగా బదులిచ్చిన భారత్

దీనికి దీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు ఈ ఉదయం పలు పాక్ ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ దాడులతో సమానమైన తీవ్రతతో భారత్ ప్రతిస్పందనను అదే ఆపరేషనల్ డొమైన్ లో నిర్వహించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ఈ రోజు ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్ లోని అనేక ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ తో సమానంగా భారత్ కూడా అదే స్థాయిలో స్పందించింది. లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది" అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

పాకిస్తాన్ కాల్పులు

జమ్మూకశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, యూరి, పూంచ్, మెంధర్, రాజౌరీ తదితర సెక్టార్లలో మోర్టార్లు, భారీ ఫిరంగులను ప్రయోగిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు గణనీయంగా పెరిగాయని మంత్రిత్వ శాఖ నివేదించింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, పాకిస్తాన్ నుంచి మోర్టార్, ఆర్టిలరీ దాడులను నిలిపివేసేందుకు భారత్ స్పందించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.