గురువారం సాయంత్రం జమ్మూలో వరుస పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఈ పేలుడు సంభవించింది.
సత్వారి, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా ప్రాంతాలపై పాకిస్తాన్ గురువారం రాత్రి ప్రయోగించిన 8 మిస్సైళ్లను భారత సైన్యం అడ్డుకుందని రక్షణ వర్గాలు తెలిపాయి.
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారిక X ఖాతా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
‘జమ్మూ & కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ మిలిటరీ స్టేషన్లను పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించి లక్ష్యంగా చేసుకుంది. ఎలాంటి నష్టం జరగలేదు" అని పోస్ట్ చేసింది.
‘భారత సాయుధ దళాలు తమ విధి విధానాల ప్రకారం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి" అని పేర్కొంది.
జమ్మూలో వైమానిక దాడుల సైరన్లు మోగిన తర్వాత, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
జమ్మూలో పూర్తిగా చీకటిగా ఉంది. భారీ పేలుళ్లు సంభవించాయి. బాంబులు, షెల్లింగ్ లేదా క్షిపణి దాడులు జరిగాయని అనుమానిస్తున్నారు. ‘భయపడకండి - మాతా వైష్ణో దేవి మనతో ఉన్నారు, అలాగే మన ధైర్యవంతులైన భారత సాయుధ దళాలు కూడా ఉన్నాయి" అని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్య్ X లో పోస్ట్ చేశారు.
పేలుళ్లు జరిగిన వెంటనే దుకాణదారులు తమ ఇళ్లకు పరుగులు తీశారు. పేలుళ్లకు ముందు కొందరు స్థానికులు ఆకాశంలో ఎర్రటి మెరుపులను చూశారని రాయిటర్స్ తెలిపింది.
జమ్మూలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఒక X వినియోగదారుడు, "జమ్మూలో మా ఇళ్లపై నుండి క్షిపణులు దూసుకుపోతున్నాయి. ఇది పుకారు కాదు, నేను స్వయంగా చూసి రికార్డ్ చేస్తున్నాను. ముప్పు నిజమైనది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం ఉంది" అని రాశారు.
జమ్మూలో కనిపించిన దృశ్యాలు హమాస్ తరహాలో ఇజ్రాయెల్పై దాడి చేసినట్లుగా ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద సంస్థలా ప్రవర్తిస్తోందని పేర్కొన్నాయి. గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ISI-హమాస్ సమావేశం జరిగిందని గుర్తు చేశాయి.
కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్లోని ఇతర పట్టణాల్లో కూడా సైరన్లు వినిపించాయి.
జమ్మూ నుండి వస్తున్న నివేదికలు కలవరపెడుతున్నాయని, సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజల కోసం తాను ప్రార్థిస్తున్నానని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు.
‘జమ్మూ నుండి వస్తున్న నివేదికలు చాలా కలవరపెడుతున్నాయి, వైమానిక దాడులు కొన్ని ప్రాంతాలను తాకినట్లు సమాచారం. జమ్మూ ప్రజల కోసం, ముఖ్యంగా సరిహద్దుల వెంబడి నివసిస్తున్న ప్రజల కోసం నా హృదయం తల్లడిల్లుతోంది. వారు మరోసారి భయంకరమైన అనిశ్చితిలో చిక్కుకున్నారు" అని ముఫ్తీ అన్నారు.
‘ఈ క్లిష్ట సమయంలో వారి భద్రత, శక్తి కోసం నా ప్రార్థనలు. సంయమనం పాటించాలని, వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని నేను అన్ని వర్గాలను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. శాంతిని మరింత దూరం చేయకూడదు" అని ఆమె అన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మందిని పొట్టనబెట్టుకున్న సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత, భారత్ బుధవారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరుతో దాడులు చేసింది.
ఖచ్చితమైన సమాచారం ఆధారంగా, దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి దుష్ట చరిత్రను పరిగణలోకి తీసుకుని ఈ లక్ష్యాలను జాగ్రత్తగా ఎంపిక చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న ఐదు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు PoK లోపల 9 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దు (IB) అవతలి వైపున ఉన్న నాలుగు లక్ష్యాలు పాకిస్తాన్ లోపల 6 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
భారత్ చేసిన ఈ సరిహద్దు దాడి ఊహించనిదేమీ కాదు. ఏప్రిల్ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్ దాడికి ధీటుగా స్పందించడానికి సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత సైనిక చర్య ప్రారంభమైంది. ప్రతిస్పందన యొక్క విధానం, లక్ష్యాలు, సమయంపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉందని ఆయన స్పష్టం చేశారు.