India Inflation Rate : గుడ్ న్యూస్.. దేశంలో దిగొచ్చిన ద్రవ్యోల్బణం!
India inflation rate : మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04శాతంగా నమోదైంది. ఏప్రిల్తో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినట్టు. ఈ విషయాన్ని కేంద్రం సోమవారం వెల్లడించింది.
India inflation rate : దేశ ప్రజలకు ఊరట కలిగించే వార్త! దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగొచ్చింది. మే నెలలో.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.04శాతంగా నమోదైనట్టు ప్రభుత్వం.. సోమవారం ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
ఏప్రిల్ నెలలో సీపీఐ(కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్) డేటా.. 7.79శాతంగా రికార్డు అయ్యింది. అది 8ఏళ్ల గరిష్ఠం. ఇక 2022 మార్చ్ నెలలో ద్రవ్యోల్బణం 6.95శాతంగా ఉంది. ప్రస్తుతం.. రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గినప్పటికీ.. అది ఆర్బీఐ అంచనాల్లోని ఎగువ స్థాయిలోనే ఉంది. అందువల్ల.. ద్రవ్యోల్బణం సమస్యల నుంచి దేశానికి విముక్తి లభించిందని ఇప్పట్లో చెప్పడం సరైనది కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ అనేక నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నట్టు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు.. 2022 మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 7.97శాతంగా నమోదైంది. ఏప్రిల్లో అది 8.31శాతంగా ఉండేది.
ప్రభుత్వం ప్రకారం.. ద్రవ్యోల్బణం రేటు 4శాతంగా ఉండాలి. ప్లస్/మైనస్ 2శాతం.. టాలరెన్స్ లెవల్గా నిర్ణయించింది. అంటే.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా.. దేశంలో ద్రవ్యోల్బణం 6శాతానికి మించకూడదు అని అర్థం! ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ఆర్బీఐకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ అనేక చర్యలు చేపడుతోంది. వడ్డీ రేట్లను పెంచి, మార్కెట్లో లిక్విడిటీని తగ్గించేందుకు కృషి చేస్తోంది. మరి.. ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆర్బీఐ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
ద్రవ్యోల్బణం భయాలతో దేశీయ సూచీలు.. సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. నిమిషాల వ్యవధిలో రూ. 7లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. మరి ద్రవ్యోల్బణం దిగొచ్చిందన్న వార్త.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది వేచిచూడాలి.
అమెరికాలో.. 40ఏళ్ల గరిష్ఠం..
అమెరికాలో మాత్రం ద్రవ్యోల్బణం ఊహించని విధంగా నమోదైంది. మే నెలలో సీపీఐ(కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్) డేటా.. ఏకంగా 8.6శాతానికి చేరింది. ఇది 40ఏళ్ల గరిష్ఠం కావడం గమనార్హం.
ఏప్రిల్ నెలలో 7.6శాతంగా ఉన్న సీపీఐ డేటా.. మే నెలలో అంచనాలకు (8.3శాతం) మించి.. 8.6శాతానికి చేరింది. 1981 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధికం. వసతి, ఆహారం, గ్యాస్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ లెక్కన చూసుకుంటే.. విమాన టికెట్ల నుంచి సెకెండ్ హ్యాండ్ కార్లు, రెస్టారెంట్లో భోజనం వరకు.. దాదాపు అన్ని ధరలు విపరీతంగా పెరిగినట్టే! ఈ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, భౌగోళిక సమీకరణల ఉద్రిక్తతలు ఇందుకు కారణం. ముఖ్యంగా.. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో శుభం కార్డు పడే సూచనలేవీ కనిపించడం లేదు.
సంబంధిత కథనం