పాక్ రక్షణ మంత్రి వింతైన వివరణ.. భారత డ్రోన్లను అందుకే అడ్డగించలేదట!-india drones didnt stopped by pakistan due to this reason pak defence minister asif khwaja explanation goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాక్ రక్షణ మంత్రి వింతైన వివరణ.. భారత డ్రోన్లను అందుకే అడ్డగించలేదట!

పాక్ రక్షణ మంత్రి వింతైన వివరణ.. భారత డ్రోన్లను అందుకే అడ్డగించలేదట!

Anand Sai HT Telugu

పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ గురించి అంతర్జాతీయంగా అందరికీ అర్థమైంది. అయితే తాజాగా పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. భారత డ్రోన్లను ఎందుకు అడ్డుకోలేదో ఆయన వివరణ ఇచ్చాడు.

పాకిస్థాన్ రక్షణ మంత్రి వింత వ్యాఖ్యలు

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌ను శుక్రవారం మరోసారి వింతైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన చేసిన కొత్త ప్రకటనపై ప్రపంచంలోనూ దుమారం రేగుతోంది. భారత డ్రోన్లను ఎందుకు అడ్డగించలేదంటే.. వింత వివరణ ఇచ్చారు. తమ సైనిక స్థావరాల కచ్చితమైన ప్రదేశాలను బహిర్గతం చేయకుండా ఉండటానికి పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా భారత డ్రోన్లను అడ్డుకోలేదని ఆయన ఒక విచిత్రమైన వాదన చేశారు. భారత్-పాక్ మధ్య జరుగుతున్న వివాదంపై ఆసిఫ్ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ.. 'నిన్న జరిగిన డ్రోన్ దాడి ప్రాథమికంగా మా లొకేషన్ తెలుసుకోవడానికి. అందుకే మా లొకేషన్ లీక్ కాకుండా ఉండేందుకు భారత డ్రోన్లను ఆపలేదు. ఒకవేళ మేం వాటిని అడ్డగించి ఉంటే మా సైనిక కీలక స్థావరాల వివరాలు భారత్‌కు తెలిసిపోయే అవకాశం ఉంది.' అని పాక్ మంత్రి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అంతకు ఒక రోజు ముందు ఆసిఫ్.. సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన మాటలు దూమారం రేపాయి. భారత విమానాలను పాక్ కూల్చివేసిందన్న ఆరోపణలపై ఆయనను ప్రశ్నించగా.. ఈ వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలు మీ వద్ద ఉన్నాయా అని అడిగినప్పుడు, ఆసిఫ్ సోషల్ మీడియా పోస్టులను చూపారు.

ఐదు భారత వైమానిక దళ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చెబుతోందని, అందుకు ఆధారాలు కావాలని సీఎన్ఎన్ జర్నలిస్ట్ కోరారు. 'మీరు నాకు మరింత సమాచారం ఇవ్వగలరా? ఐదు యుద్ధ విమానాలను కూల్చివేశామనే నిర్దిష్ట వాదనతో ప్రారంభిద్దాం. దానికి ఆధారాలు ఎక్కడున్నాయి సార్?' అని జర్నలిస్టు అడిగారు. దీనిపై మంత్రి ఆసిఫ్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూపించారు. ఇది కూడా బాగా వైరల్ అయింది.

ఆసిఫ్ తప్పుడు వాదనపై వెంటనే స్పందించిన ఆ జర్నలిస్ట్ అధికారిక ఆధారాలు లేవు కదా సర్ అని అడిగారు. 'మీరు రక్షణ మంత్రి సార్. ఈ రోజు మీతో మాట్లాడటానికి కారణం కూడా అదే సార్, సోషల్ మీడియాలో కంటెంట్ గురించి మాట్లాడకూడదు.' అని జర్నలిస్టు చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.