బెంగళూరు వాసులారా బీ అలర్ట్.. తుపాను ముప్పు పొంచి ఉంది..-imd warns of cyclonic activity near karnataka issues alert for bengaluru and other parts of the state ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బెంగళూరు వాసులారా బీ అలర్ట్.. తుపాను ముప్పు పొంచి ఉంది..

బెంగళూరు వాసులారా బీ అలర్ట్.. తుపాను ముప్పు పొంచి ఉంది..

Sudarshan V HT Telugu

కర్నాటకకు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మే 22 నాటికి ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బెంగళూరులో సోమవారం కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు.

బెంగళూరుకు తుపాను ముప్పు (Screengrab @X | IMD)

ఈ నెల 21 నుంచి అరేబియా సముద్రంలో కర్ణాటక సమీపంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నాటికి ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఈ నెల 21న కర్ణాటక తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మే 22న ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉంది’’ అని ఐఎండీ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాలకు కూడా..

తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ద్వీపకల్ప ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వర్షాలు కురిశాయని, రానున్న రోజుల్లో రుతుపవనాల ముందు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, రాజస్థాన్, అస్సాం, మహారాష్ట్ర, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మే 19న బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కర్నాటకలో మే 26 వరకు ..

కలబురగి, శివమొగ్గ, విజయపుర, దేవనాగరి, రాయచూర్, యాద్గిర్, బళ్లారి, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణ కన్నడలో వర్షాలు కురిసే అవకాశం ఉందని బెంగళూరు వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మే 21 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేడు, రేపు ఆరెంజ్ అలర్ట్

మే 20, 21 తేదీల్లో కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ ఆర్కే జెనమణి తెలిపారు. ‘ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా కర్ణాటక, తమిళనాడు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశాం. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో మే 20 లేదా 21, 22 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి’ అని తెలిపారు. మే 21 నుంచి ముంబైలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

వడగాల్పుల హెచ్చరిక

ఉత్తర భారతంలో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం లేదని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్ లో, దక్షిణ హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఢిల్లీకి వడగాల్పుల హెచ్చరిక లేదని ఐఎండీ వెల్లడించింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.