ఐఎండీ అలర్ట్​- ఈ ప్రాంతాల్లో ఇక వర్షాలు పడవు, భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి!-imd heatwave to grip nw central india rain storms in ne over next 5 days ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఐఎండీ అలర్ట్​- ఈ ప్రాంతాల్లో ఇక వర్షాలు పడవు, భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి!

ఐఎండీ అలర్ట్​- ఈ ప్రాంతాల్లో ఇక వర్షాలు పడవు, భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి!

Sharath Chitturi HT Telugu

రాబోయే ఐదు రోజుల్లో వాయవ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2–3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కాగా ఈశాన్య భారతంలో మాత్రం వర్షం పడుతుందని స్పష్టం చేసింది.

The maximum temperature is likely to rise in NW India and central India as the intense western disturbance (WD) has moved away, IMD. (PTI)

వేసవి నేపథ్యంలో దేశంలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాయువ్య, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. కాగా ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 21 నుంచి 23 వరకు విదర్భ, ఏప్రిల్ 24 వరకు దక్షిణ ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 23, 24 తేదీల్లో రాజస్థాన్, దక్షిణ హరియాణాలో హీట్​వేవ్​ పరిస్థితులు కనిపిస్తాయి.

వాయువ్య భారతంలో ఏప్రిల్​ 21 నుంచి వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని, రాబోయే రెండు రోజుల్లో మాత్రం గణనీయమైన మార్పు ఉండదని ఐఎండీ తెలిపింది. మధ్య భారతదేశం, గుజరాత్​లో, రాబోయే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదని, తరువాత ఆరు రోజుల్లో 2–3 డిగ్రీల సెల్సియస్ క్రమంగా పెరుగుతుందని అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 4–6 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.

“వెస్టర్న్​ డిస్టర్బెన్స్​ (డబ్ల్యూడీ) దూరం కావడంతో వాయవ్య భారతం, మధ్య భారతంలో ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ వ్యవస్థ చాలా తీవ్రంగా ఉంది. కొండలపై చాలా ఉరుములు, వర్షపాత కార్యకలాపాలను తీసుకువచ్చింది. కాని ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో తీవ్రమైన డబ్ల్యుడిని మేము ఆశించడం లేదు. తూర్పు భారతంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అయితే అది కూడా ఆగిపోతుంది. అందువల్ల అక్కడ కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది,” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.

మరోవైపు ఏప్రిల్ 22 నుంచి ఈశాన్య భారతంపై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

“మధ్య అసోం నుంచి త్రిపుర వరకు విస్తరించిన ఉత్తర-దక్షిణ ద్రోణి --- మూడు ద్రోణులు, మధ్య పాకిస్థాన్​, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య రాజస్థాన్ నుంచి మధ్య బంగ్లాదేశ్ వరకు కొనసాగుతున్న రెండొవ ద్రోణి, ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన మూడవ ద్రోణి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతాన్ని కలిగించే అవకాశం ఉంది (గంటకు 30-40 కి.మీ. రానున్న ఐదు రోజుల్లో ఈశాన్య భారతంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి,” అని ఐఎండీ వెల్లడించింది.

జమ్ముకశ్మీర్​లో భారీ వర్షాలు..

జమ్ముకశ్మీర్​లోని రాంబన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు, ఐదు భారీ కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మైనర్లు, 60 ఏళ్ల వృద్ధుడు సహా ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. బాగ్నా గ్రామ ప్రాంతంలో ఇల్లు కొట్టుకుపోవడంతో వీరు చనిపోయారని అధికారులు తెలిపారు.

విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఈ ప్రాంతానికి విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి, డజన్ల కొద్దీ కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి, రెండు వైపుల నుంచి 250 కిలోమీటర్ల పొడవైన జమ్ము-శ్రీనగర్ హైవే (ఎన్​హెచ్​ 44) ను దిగ్బంధించాయి. కశ్మీర్​ని దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.