Illegal Migrants : కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు.. అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయుడు-illegal migrants return to india they claims we came with handcuffs and leg shackles ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Illegal Migrants : కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు.. అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయుడు

Illegal Migrants : కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు.. అమెరికా నుంచి తిరిగొచ్చిన భారతీయుడు

Anand Sai HT Telugu Published Feb 06, 2025 07:27 AM IST
Anand Sai HT Telugu
Published Feb 06, 2025 07:27 AM IST

Illegal Migrants : అమెరికా నుంచి భారత్‌కు 104 మంది అక్రమ వలసదారులతో బయలుదేరిన విమానం వచ్చింది. కాళ్లకు తాళాలు వేసి, సంకెళ్లు వేసి తీసుకువచ్చారని గురుదాస్ పూర్‌కు చెందిన జస్పాల్ సింగ్ అనే వ్యక్తి పేర్కొంటున్నారు.

అమెరికా నుంచి వచ్చిన భారతీయులు
అమెరికా నుంచి వచ్చిన భారతీయులు

104 మంది భారతీయుల బృందం బుధవారం అమెరికా విమానాల్లో అమృత్ సర్ చేరుకుంది. వీరంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టుగా గుర్తించారు. సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో వీరిని తీసుకొచ్చారు. వలస భారతీయుల్లో ఒకరైన జస్పాల్ సింగ్ ఈ మొత్తం ప్రయాణంలో తనను కాళ్లను కట్టేసి సంకెళ్లు వేశారని ఆరోపించారు. అమృత్ సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే వాటిని తొలగించారని చెప్పారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల సింగ్ జనవరి 24న అమెరికాకు వెళ్లారు. తనను అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా విమానం బుధవారం ఇక్కడ ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులపై అణచివేతలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపిన తొలి బ్యాచ్ భారతీయులది. వీరిలో హర్యానా, గుజరాత్ నుంచి 33 మంది చొప్పున, పంజాబ్ నుంచి 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, చండీగఢ్ నుంచి ఇద్దరు.. ఇలా వివిధ ప్రాంతాలవారు ఉన్నారు.

బహిష్కరణకు గురైన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారని, వీరిలో నాలుగేళ్ల బాలుడు, ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఉన్నారని అధికారులు తెలిపారు. ‌అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి పోలీసు వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు.

బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న జస్పాల్‌ను గతంలో ఓ ట్రావెల్ ఏజెంట్ చట్టపరమైన మార్గాల ద్వారా అమెరికాకు పంపిస్తానని చెప్పి మోసం చేశాడని చెప్పారు. 'నన్ను సరైన వీసాతో పంపమని నేను ఏజెంట్‌ను అడిగాను. కానీ అతను నాకు ద్రోహం చేశాడు. 30 లక్షలకు డీల్ కుదుర్చుకుని మోసం చేశాడు.' అని జస్పాల్ పేర్కొన్నారు.

గత ఏడాది జూలైలో విమానంలో బ్రెజిల్ చేరుకున్నట్లు జస్పాల్ పేర్కొన్నారు. తదుపరి అమెరికా పర్యటన కూడా విమానంలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ఏజెంట్ మోసం చేసి అక్రమంగా సరిహద్దులు దాటేలా చేశారు.

బ్రెజిల్ లో ఆరు నెలల పాటు గడిపిన తర్వాత అమెరికా సరిహద్దుకు చేరుకున్న జస్పాల్‌ను అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల పాటు అక్కడే నిర్బంధించి పంపించారు. తనను భారత్‌కు పంపుతున్న విషయం తనకు తెలియదని జస్పాల్ వెల్లడించారు. మమ్మల్ని కాళ్లకు కట్టేసి సంకెళ్లు వేశారని ఆరోపించారు. అమృత్ సర్ విమానాశ్రయంలో వీటిని తొలగించారని చెప్పారు.

బహిష్కరణతో తాను కుంగిపోయానని జస్పాల్ చెప్పారు. ' నేను అమెరికా వెళ్లాలనుకుని చాలా డబ్బు ఖర్చు చేశాను. ఆ డబ్బును అప్పుగా తీసుకున్నాను.' ఆవేదన వ్యక్తం చేశారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.