IIT Delhi JAM 2025: జామ్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్, 2025 (JAM) ను ఐఐటీ, ఢిల్లీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 3, 2024 నుండి ప్రారంభమవుతుంది. పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఐఐటీ ఢిల్లీ అధికారిక వెబ్సైట్ joaps.iitd.ac.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
బయోటెక్నాలజీ (BT), కెమిస్ట్రీ (CY), ఎకనామిక్స్ (EN), జియాలజీ (GG), మ్యాథమెటిక్స్ (MA), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (MS), ఫిజిక్స్ (PH) సహా ఏడు పరీక్ష పేపర్లలో (CBT) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ లో జామ్ 2025 నిర్వహిస్తారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 100 నగరాల్లో నిర్వహించనున్నారు.
జామ్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్ పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో సుమారు 3000 పీజీ సీట్లు ఉన్నాయి. అలాగే, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, ఐఐఎస్టీ షిబ్పూర్, ఎస్ఎల్ఐఈటీ, డీఐఏటీల్లో 2000 సీట్లలో కూడా జామ్ 2025 ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. జామ్ ద్వారా M.Sc., M.Sc (టెక్), M.Sc.-M.Tech వంటి వివిధ మాస్టర్స్ ప్రోగ్రామ్ లకు ప్రవేశాలు ఉంటాయని ఐఐటీ ఢిల్లీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ సంస్థల్లో డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్ (రీసెర్చ్), జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ కూడా ఉంటుంది.