Arvind Kejriwal : ‘మొగుళ్లు ‘మోదీ’ భజన చేస్తుంటే.. భోజనం పెట్టకండి’- కేజ్రీవాల్
Arvind Kejriwal comments on Modi : మోదీ భజన చేసే భర్తలకు రాత్రిళ్లు భోజనం పెట్టొద్దని మహిళలతో అన్నారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Arvind Kejriwal latest news : భర్తలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భజన చేస్తుంటే.. వారికి భోజనం పెట్టొద్దని మహిళలకు పిలుపునిచ్చారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు.. మహిళా ఓటర్లతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు.
"చాలా మంది పురుషులు.. పీఎం మోదీ పేరు జపిస్తున్నారు. మీరు దానిని కరెక్ట్గా సెట్ చేయాలి. మోదీ భజన చేస్తే.. భర్తలకు రాత్రి భోజనం పెట్టకండి," అని.. దిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్ టౌన్హాల్ ఈవెంట్లో కేజ్రీవాల్ అన్నారు.
దిల్లీ బడ్జెట్లో భాగంగా ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. 18ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ. 1000 ఇస్తున్నట్టు వెల్లడించింది. దాని పేరు.. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన'. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ టౌన్హాల్ ఈవెంట్ని నిర్వహించారు అరవింద్ కేజ్రీవాల్.
"మీ కుటుంబసభ్యులు అరవింద్ కేజ్రీవాల్కి, ఆమ్ ఆద్మీకి మద్దతు ఇచ్చేలా.. వారి నుంచి మీరు ప్రతిజ్ఞ తీసుకోండి," అని దిల్లీ ముఖ్యమంత్రి అన్నారు.
2024 Lok Sabha elections : "విద్యుత్ని నేను ఉచితంగా ఇస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పండి. బస్ టికెట్లను నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇక ఇప్పుడు.. ప్రతి నెల మహిళలకు రూ. 1000 ఇస్తున్నాను. బీజేపీ ఏం చేసింది? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? ఈసారి కేజ్రీవాల్కి ఓటు వేయండి," అని ఆమ్ ఆద్మీ సుప్రీమో తెలిపారు.
"కొన్ని పార్టీలు.. మహిళలకు కొన్ని పోస్టులు ఇస్తారు. మహిళల అభ్యున్నతి జరిగిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. మహిళలకు పోస్టులు రాకూడదని నేను అనడం లేదు. మహిళలకు పెద్ద పెద్ద పోస్టులు రావాలి. వారికి అన్ని రావాలి. కానీ ఇప్పుడు.. 2,3 మహిళలే లబ్ధిపొందుతున్నారు. మిగిలిన మహిళల పరిస్థితేంటి?" అని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్.
అనంతరం.. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని మహిళలకు వివరించారు కేజ్రీవాల్. దీనితో మహిళలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన హైలైట్స్..
Mukhyamantri Mahila Samman Yojana : ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద.. 18ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇస్తుంది ప్రభుత్వం.
ఈ పథకం ద్వారా ప్రతి నెల రూ. 1000 పొందాలంటే.. సంబంధిత మహిళ వయస్సు 18ఏళ్లు పైబడి ఉండాలి. ఆమె దిల్లీ ఓటరై ఉండాలి. ఆమె ఇతర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందకూడదు. సంబంధిత మహిళ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా ఉండకూడదు.
ఈ ఏడాది జనవరిలో పబ్లీష్ అయిన దిల్లీ ఫైనల్ ఎలక్టోరల్ డేటా ప్రకారం.. దేశ రాజధానిలో మొత్తం 67,30,371 మంది మహిళలు ఉన్నారు.
సంబంధిత కథనం