Manish Sisodia: ఢిల్లీలో ప్రభుత్వ స్కూల్కు ‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ బ్యానర్
Manish Sisodia: ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేట్కు మనీశ్ సిసోడియాకు సంబంధించిన బ్యానర్ దర్శనమిచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) ప్రముఖ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం ఢిల్లీని కుదిపేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆప్ విమర్శలు కురిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Policy 2021-22 Case)లో సిసోడియా తప్పు చేసినట్టు ఆధారాలు లేకున్నా సీబీఐ ఆయనను అరెస్టు చేసిందని ఢిల్లీ అధికార పార్టీ ఆప్ విమర్శిస్తోంది. ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు ‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’ (I Love Manish Sisodia) అని రాసి ఉన్న బ్యానర్ ఒకటి కనిపించింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇవే.
ట్రెండింగ్ వార్తలు
కేసు నమోదు
Manish Sisodia: ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల గేట్కు సిసోడియా బ్యానర్ ఏర్పాటైంది. దీనిపై అక్కడి స్థానికులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Manish Sisodia: శాస్త్రిపార్క్ ప్రాంతానికి చెందిన దివాకర్ పాండే అనే వ్యక్తి.. ఈ బ్యానర్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ ఆస్తుల దుర్వినియోగ నిరోధక చట్టం సెక్షన్ 3 కింద శాస్త్రిపార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) కో-ఆర్టినేటర్ గజాలాతో పాటు ప్రిన్సిపాల్.. స్కూల్ గేట్కు సిసోడియా బ్యానర్ను ఏర్పాటు చేసేందుకు సహకరించారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే అనుమతి ఉందంటూ..
“ఐలవ్ మనీశ్ సిసోడియా అనే పోస్టర్ను ఆమ్ఆద్మీ పార్టీ కార్యకర్తలు కొందరు శాస్త్రిగేట్ ప్రభుత్వ పాఠశాల గేట్కు తగిలించారు. ఆ సమయంలో కొందరు ప్రజలు వ్యతిరేకించారు. విద్యకు దేవాలయం లాంటి స్కూల్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలని వాదించాం. అయితే ఈ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే అనుమతి ఉందని ఆప్ కార్యకర్తలు చెప్పారు. ఎమ్మెల్యేను అడిగితే ఆయన కూడా అనుమతి ఇచ్చానని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం పాఠశాలను వినియోగించుకునేందుకు ఇలాంటి అనుమతులు ఏవీ ఉండవని మాకు తెలుసు” అని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో దివాకర్ పాండే చెప్పారు.
Manish Sisodia Arrest: కాగా, మనీశ్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు తాజాగా మరో రెండు రోజులు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది. సిసోడియాతో పాటు గతేడాది ఈ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
సంబంధిత కథనం