Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..-huge traffic jam on delhi kolkata highway all vehicles stuck for 4 days ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..

Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..

Sharath Chitturi HT Telugu

బిహార్​లోని దిల్లీ- కోల్​కతా జాతీయ రహదారిపై అతి భారీ ట్రాఫిక్​ జామ్​ నెలకొంది! అనేక వాహనాలు 4 రోజులుగా ట్రాఫిక్​లో చిక్కుకుపోయాయి. కొన్ని కిలోమీటర్లు ముందుకు కదిలేందుకు 5,7 గంటల సమయం పడుతోంది!

దిల్లీ- కోల్​కతా హైవేపై ట్రాఫిక్​ జామ్​..

బిహార్​లోని దిల్లీ- కోల్​కతా హైవేపై భారీ ట్రాఫిక్​ జామ్​ నెలకొంది! అనేక వాహనాలు 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్​లో చిక్కుకుపోయాయి. గత 24 గంటల్లో వాహనాలు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ముందుకు కదిలినట్టు సమాచారం. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ట్రాఫిక్​ జామ్​లో పడిగాపులుకాస్తున్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!

దిల్లీ- కోల్​కతా హైవేపై ట్రాఫిక్​ జామ్​కి కారణం ఏంటి?

అదొక అంతం లేని పొడవైన క్యూ లైన్. వందల కొద్దీ వాహనాలు ఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా బంపర్-టు-బంపర్ ట్రాఫిక్​ మధ్య నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా బిహార్‌లోని దిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై చిక్కుకుపోయిన వాహనాలతో ఆ రూట్​ మొత్తానికే మూసుకుపోయింది! ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

గత శుక్రవారం బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా, రహదారి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన మళ్లింపులు, సర్వీస్ లేన్లు.. ఎన్​హెచ్​ 19లోని వివిధ ప్రాంతాల్లో నీట మునిగాయి.

మంగళవారం రాత్రి నాటికి ఉన్న సమాచారం ప్రకారం.. ఈ రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డాయి. నీరు నిలిచిపోవడం వల్ల వాహనాలు జారిపోతూ, గంటగంటకూ ట్రాఫిక్ మరింతగా పెరుగుతోంది. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి కూడా గంటలు పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ రోహ్‌తాస్ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది!

ఈ భారీ ట్రాఫిక్ జామ్‌ను పరిష్కరించడానికి స్థానిక యంత్రాంగం ఎటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు! జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) గానీ, రోడ్డు నిర్మాణ సంస్థ గానీ ఈ విషయంలో ఏ చర్యలూ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాహనాలు 24 గంటల్లో కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే కదలగలుగుతున్నాయి!

"గత 30 గంటల్లో, మేము కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాం. మేము టోల్స్, రోడ్డు పన్నులు, ఇతర ఖర్చులు చెల్లించినప్పటికీ, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతున్నాం. రోడ్డుపై ఎన్​హెచ్​ఏఐ సిబ్బంది కానీ, స్థానిక అధికారులు కానీ ఎవరూ కనిపించడం లేదు," అని భారీ ట్రాఫిక్​ జామ్‌లో చిక్కుకున్న ప్రవీణ్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.

"రెండు రోజులుగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాం. ఆకలి దప్పికలతో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి కూడా గంటలు పడుతోంది," అని మరొక ట్రక్ డ్రైవర్ సంజయ్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు.

ఈ ట్రాఫిక్ స్తంభన వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పాడైపోయే ఆహార పదార్థాలను తీసుకువెళ్తున్న డ్రైవర్లు ఈ భారీ జామ్ వల్ల తమ సరుకులకు నష్టం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. పాదచారులు, అంబులెన్స్‌లు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు కూడా ఈ ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నాయి!

రోడ్డు అడ్డంకి గురించి ఎన్​హెచ్​ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మను అడగ్గా, ఆయన కెమెరా ముందుకు వచ్చి సమాధానం ఇచ్చేందుకు రావడానికి నిరాకరించారు!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.