Ayman al-Zawahiri : అల్ఖైదా అధినేతను అమెరికా ఎలా గుర్తించింది? ఎలా చంపింది?
Ayman al-Zawahiri : అల్ఖైదా అధినేత అల్ జవహరిని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ ఓ సినిమా కథ స్థాయిలో జరిగింది.
Ayman al-Zawahiri : 9/11 ఉగ్రదాడి నుంచే.. ప్రస్తుత అల్ఖైదా అధినేత ఆయ్మన్ అల్ జవహరిపై అమెరికా కన్ను ఉంది. అతడిని పట్టించినా, ఎక్కడున్నాడు అన్న సమాచారం ఇచ్చినా.. 25మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. కాగా.. కొన్నేళ్లుగా అల్ జవహరి కార్యకలాపాలపై అమెరికా మరింత దృష్టిసారించింది. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంది.
ట్రెండింగ్ వార్తలు
కాబుల్ సేఫ్ హౌజ్..
అల్ఖైదా అధినేత అల్ జవహరి మాత్రం.. ఎన్నో ఏళ్లు రహస్యంగా దాక్కునే ఉన్నాడు. చీకట్లోనే తన కార్యకలాపాలను సాగించాడు. అతను పాకిస్థాన్లోని అదివాసీ ప్రాంతాల్లో ఉన్నట్టు ఒకసారి, అఫ్గానిస్థాన్లో ఉన్నట్టు ఇంకోసారి వార్తలు వచ్చాయి. ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించిన అమెరికా.. పక్క ప్రణాళికతో ముందడుగు వేసింది.
అల్ జవహరికి మద్దతుగా నిలిచిన నెట్వర్క్ను కొన్నేళ్లుగా ట్రాక్ చేస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇక అఫ్గానిస్థాన్ నుంచి తమ సైన్యం బయటకు వెళ్లిపోయాక.. దేశంలో అల్ఖైదా ప్రభావం పెరుగుతుందని అమెరికా భావించింది.
ఈ ఏడాది.. అల్ జవహరి కుటుంబాన్ని అధికారులు గుర్తించారు. కాబుల్లోని ఓ సేఫ్ హౌజ్కు జవహరి భార్య, కుమార్తె- ఆమె పిల్లలు వెళ్లడాన్ని గమనించారు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి అల్ జవహరి కూడా వచ్చాడు!
Ayman Al-Zawahiri 9/11 : సేఫ్ హౌజ్లో ఉన్న వ్యక్తి.. ఆ తర్వాత బయటకి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో అందులో ఉన్నది అల్ఖైదా అధినేతేనా? అని ధ్రువీకరించుకునేందుకు అమెరికాకు కొన్ని నెలలు పట్టింది. ఆ సేఫ్ హౌజ్ బాల్కెనీలో జవహరి పలుమార్లు కనిపించాడు. ఆ విధంగా.. అక్కడ ఉన్నది జవహరినే అని ఏప్రిల్ తొలినాళ్లల్లో.. అధికారులు ఫిక్స్ చేశారు.
ఆ వెంటనే అమెరికాలో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. అధ్యక్షుడు జో బైడెన్కు అప్పటి పరిస్థితులను అధికారులు వివరించారు. జవహరి హత్యకు బైడెన్ అంగీకరించారు. ఇక పనులు వేగంగా ముందుకు కదిలాయి.
ముందు కాబుల్లోని ఆ సేఫ్ హౌజ్ను అధికారులు బయట నుంచి దర్యాప్తు చేశారు. నిర్మాణం ఎలా జరిగింది? అసలు ఆ సేఫ్ హౌజ్ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎలాంటి నష్టం జరగకుండా.. అక్కడ అమెరికా ఆపరేషన్ నిర్వహించవచ్చా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పడ్డారు.
Al Zawahiri : ఈ క్రమంలోనే జులై తొలినాళ్ల నుంచి.. అల్ జవహరి హత్యకు ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఆ వివరాలన్నీ.. బైడెన్కు అధికారులు ఎప్పటికప్పుడు అందించారు. బైడెన్ కూడా.. ప్రణాళికలను కుణ్నంగా పరిశీలించేవారు. జులై 25న ఈ విషయంపై చివరిసారిగా.. బైడెన్తో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.
"అన్ని విషయాలను బైడెన్ అడిగి తెలుసుకున్నారు. వాతావరణం ఎలా ఉంటుంది? వెలుతురు ఉంటుందా? ఆపరేషన్ను అడ్డుకునే విధంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా?" అన్న ప్రశ్నలు బైడెన్ వేశారని ఓ అధికారి వెల్లడించారు.
వైమానిక దాడి జరిగితే.. కాబుల్లో జరిగే నష్టంపైనా వివరణ ఇవ్వాలని బైడెన్ అడిగినట్టు తెలుస్తోంది.
అదే సమయంలో.. ఉన్నతస్థాయి న్యాయ నిపుణుల బృందం సమావేశమైంది. అల్ జవహరిని మట్టుబెడితే వచ్చే న్యాయపరమైన సవాళ్లను పరిశీలించింది. అమెరికా పౌరుల హత్యకు పాల్పడిన జవహరిని చంపవచ్చని, ఎలాంటి న్యాయపరమైన సవాళ్లు వచ్చినా ఎదుర్కోవచ్చని తేల్చింది.
ఆ విధంగా.. అఫ్గానిస్థాన్ కాలమానం ప్రకారం.. జులై 30 రాత్రి 9:48గంటలకు.. అల్ జవహరి ఉన్న సేఫ్ హౌజ్పై అమెరికా సైన్యం వైమానికి దాడి చేసింది.
ఇక్కడ.. వైమానిక దాడి జరిగిన విధానాన్ని ప్రస్తావించారు. అల్ జవహరి తన సేఫ్ హౌజ్ బాల్కెనీలో కనిపించాడు. 'హెల్ఫైర్'గా పిలిచే రెండు మిసైళ్లను డ్రోన్ల ద్వారా అమెరికా సైన్యం అతడిపై ప్రయోగించింది. అంతే.. పెద్దగా శబ్దాలేవీ రాలేదు. బాల్కెనీలోని కిటికీలు పగిలిపోయాయి. మిగిలిన సేఫ్ హోజ్ మొత్తం.. చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
పని జరిగిపోయింది. అల్ జవహరి మరణించాడు. అతడి కుటుంబసభ్యులకు ఎలాంటి హానీ జరగలేదు. ఆపరేషన్ ముగిసింది.
అల్ ఖైదా అధినేత అల్ జవహరిని మట్టుబెట్టినట్టు తాజాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచానికి ప్రకటించారు.
సంబంధిత కథనం
టాపిక్