Bagmati Express : గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ప్రెస్ ఎలా ఢీకొట్టింది? అసలేం జరిగింది?
Bagmati express accident today news : మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ చెన్నై సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడగా, 12 బోగీలు పట్టాలు తప్పాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది?
మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘటనలో 19మంది గాయపడ్డారు. పొన్నేరి- కావరైపేట స్టేషన్ల మధ్య చెన్నై-గూడూరు సెక్షన్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలుకు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి.
మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణమేమిటి?
దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైలు కవరైపెట్టైలో ఆగకూడదు. స్టేషన్ గుండా వెళ్లాల్సి ఉంది. చెన్నై నుంచి బయలుదేరిన తర్వాత మైసూరు-దర్భాంగా ఎక్స్ప్రెస్ సిగ్నల్స్ను డ్రైవర్ సరిగ్గానే ఫాలో అయ్యాడు. అయితే రైలు మెయిన్ లైన్లో వెళ్లకుండా పొరపాటున లూప్లైన్కు మారడంతో, అందులో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.
ఇలా ఎందురు జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
"కవరైపేట్టై స్టేషన్లోకి ప్రవేశించే సమయంలో, రైలు సిబ్బంది భారీ కుదుపును ఎదుర్కొన్నారు. ఇచ్చిన సిగ్నల్ ప్రకారం ప్రధాన మార్గంలోకి వెళ్లడానికి బదులుగా, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న రైలు లూప్ లైన్లోకి ప్రవేశించింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఈ ఎక్స్ప్రెస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది,' అని మరో అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:- Bagmati Express: గూడ్స్ రైలును ఢీకొన్న భాగ్ మతి ఎక్స్ ప్రెస్; పట్టాలు తప్పిన రెండు బోగీలు
మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం తాజా అప్డేట్స్..
మైసూరు-దర్భాంగా భాగమతి ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైలు శనివారం ఉదయం డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది.
తెల్లవారుజామున 4:45 గంటలకు రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణికులకు ఆహారం, నీరు అందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి బాధిత ప్రయాణికులకు అధికారులు సహాయం అందించారు.
ఈ రైళ్ల రద్దు..
మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం తర్వాత రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం మొత్తం సెక్షన్లో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. రెండు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరో అరడజనుకు పైగా ట్రైన్స్ని దారి మళ్లించారు.
ఈ రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారు:
• రైలు నంబర్ 12077 డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్
• రైలు నంబర్ 12078 విజయవాడ - డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్.
మరికొన్ని రైళ్లను శుక్రవారం రాత్రికి రాత్రే దారి మళ్లించారు.
సంబంధిత కథనం