భారీ ఉష్ణోగ్రతల అనంతరం కురిసిన వర్షాలతో దేశ రాజధాని దిల్లీలోని ప్రజలు శుక్రవారం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి దిల్లీలో హీట్వేవ్ పరిస్థితి కనిపిస్తుందని, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శుక్రవారం సాయంత్రం దేశ రాజధానిని భారీ దుమ్ము తుపాను, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఈ తాకిడికి పలు చెట్లు నేలకూలాయి. దీనికి తోడు ఈదురుగాలుల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 15 విమానాలను దారి మళ్లించారు.
దిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాశ్రయంలో కొన్ని విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని ఎయిర్పోర్ట్ ఆపరేటర్ డీఐఏఎల్ తెలిపింది. తాజా ఫ్లైట్ అప్డేట్స్ కోసం ప్రయాణికులు ఆయా విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, సిక్కిం, ఉత్తర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్షాలు ఈ ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 12న, అసోం, మేఘాలయలో ఏప్రిల్ 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజా పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ఉత్తరాఖండ్లో, ఈశాన్య- దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో రానున్న 6 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఏప్రిల్ 11 నాటి వాతావరణ బులెటిన్ ప్రకారం.. "రాబోయే 3 రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి. తరువాత 4 రోజుల్లో క్రమంగా 3-5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. రానున్న 3 రోజుల్లో మధ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2-4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.
ఏప్రిల్ 12న రాజస్థాన్లో కొన్ని చోట్ల ధూళి తుపానులు వచ్చే అవకాశం ఉండగా, పంజాబ్, హరియాణా, ఛండీగఢ్, దిల్లీ, రాజస్థాన్కు ఉరుములతో కూడిన తుపాను హెచ్చరికలు జారీ చేశారు.
సంబంధిత కథనం