హరియాణాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన జరిగింది. ఓ 35ఏళ్ల మహిళ, ఆమె 5ఏళ్ల కూతురిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 5ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఒక 13ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు!
హరియాణా జింద్లో ఏప్రిల్ 22 రాత్రి ఈ ఘటన జరిగింది. ముగ్గురు నిందితులు ఓ 5ఏళ్ల చిన్నారిని హత్య చేశారని, ఆ తర్వాత ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు ప్రతినిధి అమిత్ ఖరాబ్ తెలిపారు.
మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె ఐదేళ్ల కుమార్తె హత్య కేసులో ముగ్గురు పెద్దలు, ఒక మైనర్ని జింద్ పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడు హత్యలో మాత్రమే పాల్గొన్నాడని, అతడిని సేఫ్ హౌజ్కి తరలించామని, ముగ్గురు పెద్దలను పోలీసు కస్టడీకి తీసుకున్నామని అధికారులు వివరించారు.
నిందితుల పేర్లు.. హమీద్ ఖాన్ (46), బీరు (18), శివ (18). మైనర్ కాబట్టి13 ఏళ్ల బాలుడి వివరాలను వెల్లడించకూడదు.
ఏప్రిల్ 26న సోనేపట్లో బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
అనంతరం ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
గతంలో ఆమె భర్తతో జరిగిన గొడవలో మహిళ తనపై పరుష పదజాలం ఉపయోగించడంతోనే ఆమె కూతురిని హత్య చేశానని హమీద్ అంగీకరించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 22న ఆమె భర్తకు పక్కింటి వ్యక్తికి వాగ్వాదానికి జరిగింది. అది గొడవగా మారి, శారీరక దాడికి దారితీసింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, వారు వచ్చి సమస్యను పరిష్కరించారు. మధ్యవర్తిత్వం తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కానీ పొరుగింటి వ్యక్తితో పాటు మరో ముగ్గురు మళ్లీ బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఆమె కుమార్తెను అపహరించి తాడుతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లిన నిందితులు (మైనర్ కాకుండా) మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అదే చెత్తబుట్ట దగ్గర పడేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ 24న బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.
"నిందితులపై ఏప్రిల్ 24న సామూహిక అత్యాచారం, హత్య అభియోగాలు మోపారు. ఆ తర్వాత ఏప్రిల్ 27న లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్లను ఈ కేసులో చేర్చారు" అని ఓ అధికారి తెలిపారు.
సంబంధిత కథనం