Gujarat Elections 2022 : గుజరాత్లో.. రెండో దశ పోలింగ్ షురూ
Gujarat Elections 2022 : గుజరాత్ ఎన్నికల హడావుడికి నేటితో తెరపడనుంది. 93 నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 2.51కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Gujarat Elections 2022 : హైఓల్టేజ్ ప్రచారాలకు తెరపడిన తర్వాత.. గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. 93 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
మొత్తం మీద ఉత్తర, మధ్య గుజరాత్లోని 14 జిల్లాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. అహ్మదాబాద్, గాంధీనగర, మేహ్సానా, పటాన్, బనస్కాంత, సబర్కాంత, అరావళి, మహిసాగర్, పంచమహల్, దహోడ్, వడోదరా, ఆనంద్, ఖేడా, ఛోటా ఉదయ్పూర్ జిల్లాల్లో ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. 93 సీట్ల కోసం 61 పార్టీలకు చెందిన 833మంది బరిలో నిలిచారు. 2.51కోట్ల మంది ఓటర్లు.. వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
Gujarat elections latest updates : ఓటింగ్ కోసం 26,409 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. వీటిల్లో 93 మోడల్ పోలింగ్ బూత్లు, 93 ఇకో ఫ్రెండ్లీ బూత్లు ఉన్నాయి. మరో 93 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తుండగా.. 14 బూత్లను యువత చూసుకుంటోంది. దాదాపు 36వేల ఈవీఎంలను ఈసారి వినియోగిస్తోంది. 29వేల మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 84వేల మంది పోలింగ్ ఆఫీసర్లు.. విధి నిర్వహణలో ఉన్నారు.
"2,51,58,730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో.. 1,29,26,501 మంది పురుషులు, 1,22,31,335 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ నుంచి 894మంది ఓటర్లు ఉన్నారు," అని ఈసీ స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఈ దఫా పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్ సిటీలోని ఓ పోలింగ్ బూత్లో మోదీ ఓటు వేయనున్నారు.
ఉప ఎన్నికలు కూడా..
2022 By elections : గుజరాత్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ సీట్లు, ఒక లోక్సభ స్థానానికి ఓటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
వీటిల్లో ఉత్తర్ప్రదేశ్ మెయిన్పూరి లోక్సభ సీటుకు ఉప ఎన్నిక హాట్టాపిగ్గా మారింది. దివంగత ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు.
మరోవైపు ఉత్తర్ప్రదేశ్లోని రామ్పూర్ సదర్, ఖటౌలీ, ఒడిశాలోని పదమ్పూర్, రాజస్థాన్కు చెందిన సర్దరాషహర్, బిహార్లోని కుర్హాని, ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్లో సైతం ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి.
ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత.. సోమవారం సాయంత్రం నాటికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్గిట్ పోల్స్ వెలువడతాయి.
Gujarat election results 2022 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప సమరం ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.
సంబంధిత కథనం