Telugu News  /  National International  /  Gujarat Assembly Elections, 'Son' Rise In 20 Seats As Bjp, Cong Field Dynasts
బీజేపీ ఫ్లాగ్​లు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు!
బీజేపీ ఫ్లాగ్​లు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు! (HT_PRINT)

Gujarat Assembly elections : ఆ సీట్లల్లో ‘వారసులకే’ టికెట్లు.. బీజేపీ కూడా!

21 November 2022, 11:59 ISTChitturi Eswara Karthikeya Sharath
21 November 2022, 11:59 IST

Gujarat Assembly elections : గుజరాత్​ ఎన్నికల నేపథ్యంలో వారసత్వ రాజకీయాలు మరోమారు వార్తలకెక్కాయి. బీజేపీ, కాంగ్రెస్​లు.. కొంతమంది ‘వారసులకు’ టికెట్లు ఇవ్వడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

Gujarat Assembly elections : 'వారసత్వ రాజకీయాలు..' ఈ పదం భారత దేశంలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో ఈ విషయంపై ఇంకాస్త ఎక్కువగానే చర్చలు జరుగుతుంటాయి. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతోంది. వారసత్వ రాజకీయాలకు దూరం అని చెప్పే బీజేపీ సైతం.. పలువురు 'వారసులకు' టికెట్లు ఇవ్వడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

ఆ సీట్లల్లో వారసులకే టికెట్లు..

182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్​కు డిసెంబర్​ 1,5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ 182 సీట్లల్లో 20 స్థానాలు వారసులకు వెళ్లాయి! అంటే.. సిట్టింగ్​, మాజీ ఎమ్మెల్యేల తనయులను ఆయా సీట్లల్లో నుల్చొబెట్టాయి ప్రధాన పార్టీలు. ఈ తరహా క్యాండిడేట్లు.. కాంగ్రెస్​ నుంచి 13మంది ఉండగా.. కమలదళం నుంచి ఏడుగురు ఉన్నారు.

Gujarat Assembly elections 2022 : వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా.. ఒక్కోసారి పార్టీలు.. ‘వారసులకు’ సీట్లు ఇవ్వక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేకో.. లేదా కచ్చితంగా గెలుస్తారు అని అనిపించో.. వారసులకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు.

కాంగ్రెస్​ తరఫున 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన్​ నేత మోహన్​సిన్హ్​ రథ్వ.. పార్టీకి వీడ్కోలు పలికి, ఇటీవలే బీజేపీలో చేర్చారు. ఆయన్ని కమలదళం రివార్డు చేసింది. ఆయన తనయుడు రాజేంద్రసిన్హ్​ రథ్వను ఛోట ఉదేపూర్​ సీటు నుంచి బరిలో దింపింది. ఇక్కడ.. మాజీ రైల్వే మంత్రి నరన్​ రథ్వ కుమారుడు, కాంగ్రెస్​ అభ్యర్థి సంగ్రమ్​సిన్హ్​ రథ్వ బరిలో నిలిచారు. అభ్యర్థులిద్దరికీ ఇదే తొలి ఎన్నిక కావడం గమనార్హం.

పార్టీ ఫిరాయించిన వారికి.. టికెట్​ పక్కా..!

ఇక కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్యే కరణ్​సిన్హ్​ పటేల్ గత ఎన్నికలో బీజేపీలో చేరారు. ఫలితంగా.. ఆయన​ తనయుడు కను పటేల్​.. సనంద్​ సీటులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా ఆయన్ని అదే సీటులో బరిలో దింపింది బీజేపీ.

Gujarat dynasty politics : 2007, 2012లో కాంగ్రెస్​ టికెట్​ మీద గెలిచి.. 2017లో పార్టీని వీడి బీజేపీలో చేరారు రామ్​సిన్హ్​ పార్మర్​. 2017లో బీజేపీ టికెట్​తో పోటీ చేసి ఓడిపోయరు. తాజాగా.. ఆయన కుమారుడు యోగంద్ర పార్మర్​ను థశ్ర సీటు నుంచి బరిలో దింపింది బీజేపీ.

మాజీ ఎమ్మెల్యే మనూభాయ్​ పార్మర్​ తనయుడు శైలేష్​ పార్మర్​.. దానిలిమ్డా సీటులో పోటీ చేసి రెండుసార్లు విజయాన్ని దక్కించుకున్నారు. ఈసారి కూడా ఆయనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్​.. అదే సీటు నుంచి బరిలో దింపింది.

Gujarat assembly elections BJP : ఇక్కడ మహేంద్రసిన్హ్​ వఘేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన గుజరాత్​ మాజీ సీఎం శంకేర్​సిన్హ్​ వఘేల కుమారుడు. 2012, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున బరిలో దిగి గెలిచిన మహేంద్రసిన్హ్​ వఘేల.. 2019లో కాషాయ ఖండువ కప్పుకున్నారు. కానీ గత నెలలో కాంగ్రెస్​కు తిరిగి రావడం.. పార్టీ ఆయనకు బయాద్​ సీటును అప్పజెప్పడం.. అన్ని చకచకా జరిగిపోయాయి.

మరో మాజీ సీఎం అమర్​సిన్హ్​ చౌదరి తనయుడు తుషార్​ చౌదరిని.. బర్దోలి సీటు నుంచి బరిలో దింపుతోంది కాంగ్రెస్​. 2004-09, 2009-14 మధ్య మాండ్లీ ఎంపీగా ఆయన విధులు నిర్వహించారు.

Gujarat assembly elections Congress : జయేష్​ రడాదియ.. మాజీ బీజేపీ ఎంపీ విట్టల్​ రడాదియ తనయుడు. ఈయన..కాంగ్రెస్​ టికెట్​ మీద ధోరాజీ ఉప ఎన్నికలో గెలిచారు. 2012లో జెట్​పూర్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ తండ్రీకొడుకులు ఇద్దరు.. 2013లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2017 ఎన్నికలో అదే సీటు నుంచి గెలిచారు జయేష్​. ఇప్పుడు కూడా ఆయన్ని అదే సీటులో బరిలో దింపింది బీజేపీ.

"రాజకీయాలను వారసత్వంగా భావించి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. వీరికి ఫాలోయింగ్​ చాలా ఉంటుంది. ఆయా స్థానాల్లో వీరికే పట్టు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రత్యామ్నాయాలను వెతకడంలో పార్టీలు విఫలమవుతున్నాయి. అందుకే వారికో, వారి కుటుంబాలకో టికెట్లు ఇవ్వాల్సి వస్తోంది. అయితే కొన్ని సీట్లు భిన్నంగా ఉంటాయి. కొంత మంది నేతలకు కొన్ని సీట్లు కంచుకోటల్లాగా ఉంటాయి. వాటిల్లో పోటీ చేసేందుకు పార్టీలోని ఇతర నేతలు కూడా భయపడిపోతారు. ఈ పరిస్థితుల్లో పార్టీలు చేసేదేం ఉంటుంది?" అని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది అభిప్రాయపడ్డారు.

రెండు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. డిసెంబర్​ 8న ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఈ 'వారసులు' ఈ మేరకు ప్రదర్శన చేస్తారో వేచిచూడాలి.