రెండు దశల్లో జనగణన- తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అంటే..-govt notifies census 2027 to be conducted in two phases check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రెండు దశల్లో జనగణన- తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అంటే..

రెండు దశల్లో జనగణన- తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అంటే..

Sharath Chitturi HT Telugu

2027 జనగణనకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్​ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. రెండు దశల్లో ఈ జనాభా లెక్కలు ఉంటాయని, వాటి రిఫరెన్స్​ తేదీలను కూడా పేర్కొంది.

ఇండియాలో జనగణన ఎప్పటి నుంచి అంటే.. (AFP)

యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న జనగణనపై కేంద్రం సోమవారం అధికారిక నోటిఫికేషన్​ని జారీ చేసింది. 2027 సెన్సస్​ రెండు దశల్లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌లో 2027 జనాభా గణన కోసం రిఫరెన్స్ తేదీని కూడా ప్రకటించింది.

2027 జనాభా లెక్కల వివరాలు..

తొలి దశలో భాగంగా లద్దాఖ్​, జమ్ముకశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లోని మంచుతో నిండిన ప్రాంతాలకు అక్టోబర్​ 1, 2026ని రిఫరెన్సీ తేదీగా కేంద్రం ప్రకటించింది. రెండో దశలో మార్చ్​ 1, 2027ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీగా ఉంటుందని తెలియజేసింది.

"లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన ప్రాంతాలు మినహా, సదరు జనగణనకు రిఫరెన్స్ తేదీ మార్చ్​ 1, 2027న 00.00 గంటలుగా [అర్ధరాత్రి 12 గంటలు] ఉంటుంది," అని హోం మంత్రిత్వ శాఖ తన తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

"లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన ప్రాంతాలకు సంబంధించి, రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1, 2026న 00:00 గంటలుగా ఉంటుంది," అని నోటిఫికేషన్​లో ఉంది.

వాస్తవానికి 2021లో జనగణన జరగాల్సి ఉంది. కానీ కొవిడ్​ సంక్షోభం కారణంగా ఇండియాలో జనాభా లెక్కలు ఆలస్యమవుతూ వచ్చాయి. చివరికి, 2026లో మొదలవుతాయి.

1948 జనగణన చట్టం, 1990 జనగణన నిబంధనల ప్రకారం భారత జనగణనను నిర్వహిస్తారు.

భారత్​లో చివరి జనగణన ఎప్పుడు జరిగింది?

భారతదేశంలో చివరి జనగణన 2011లో రెండు దశల్లో జరిగింది. i) మొదటి దశ – హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్​ఎల్​ఓ) (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2010 వరకు). ii) రెండొవ దశ – జనాభా గణన (పీఈ) (ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28, 2011 వరకు).

2021 జనగణన కూడా ఇదే విధంగా రెండు దశల్లో, మొదటి దశ ఏప్రిల్-సెప్టెంబర్ 2020లో, రెండవ దశ ఫిబ్రవరి 2021లో నిర్వహించడానికి కేంద్రం ఆ సమయంలో ప్రతిపాదించింది.

"2021లో నిర్వహించాల్సిన జనగణన మొదటి దశకు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి, కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఫీల్డ్ వర్క్ ఏప్రిల్ 1, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ప్రబలడం వల్ల, జనగణన పనులు వాయిదా పడ్డాయి," అని ఆ సమయంలో ప్రభుత్వం తెలిపింది.

2027 సెన్సస్​ పనులపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా గత కొంతకాలంగా ఫోకస్​ చేశారు. ఇదే విషయంపై ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల్లో స్వీయ గణన కూడా ఉంటుందని ఆయన అన్నారు.

అంతేకాదు, ఈసారి జనగణనలో కుల గణన కూడా ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.