ఉత్తర్ప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! తనకు కేన్సర్ ఉందని తేలడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు.. తన భార్యను కాల్చి చంపేశాడు.
యూపీ ఘజియాబాద్లోని నంద్గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న 57ఏళ్ల వ్యక్తి ఒక ప్రాపర్టీ డీలర్. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన జీవిస్తున్నాడు.
కాగా ఆయనకి కేన్సర్ ఉందని ఇటీవలే తేలింది. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న పిల్లలు తుపాకీ శబ్దానికి ఉల్లిక్కిపడి కిందకు పరిగెత్తారు. అప్పటికే తల్లిదండ్రులు మరణించారు.
ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలిచారు. ఫోరెన్సీక్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది.
ఇంతలో కేన్సర్ బాధితుడి సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది.
"ఆ వ్యక్తి కేన్సర్తో బాధపడుతున్నాడు. బుధవారం తన లైసెన్స్డ్ రివాల్వర్తో తొలుత భార్యను షూట్ చేసి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కనిపించింది. తాను కేన్సర్తో బాధపడుతున్నానని, కుటుంబానికి భారం అవ్వకూడదని, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదని బాధితుడు రాశాడు. వాస్తవానికి తన కుటుంబానికి అసలు తన కేన్సర్ విషయం తెలియదని సూసైడ్ నోట్లో వివరించాడు. చనిపోయే ముందు, తన భార్యని కూడా చంపేశాడు," అని నంద్గ్రామ్ సర్కిల్ ఏసీపీ పూనమ్ మిశ్రా తెలిపారు.
కేన్సర్కి చికిత్స చేసినా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు భావించిన ఆ 57ఏళ్ల వ్యక్తి, చనిపోవడం ఉత్తమం అని భావించినట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. "కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేశాము" కాబట్టి తనతో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లిపోతున్నట్టు బాధితుడు ఆ నోట్లో రాశాడని వివరించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.
సంబంధిత కథనం