‘‘భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధం’’: పాకిస్తాన్ పీఎం షరీఫ్-fully capable of and prepared against any misadventure says pakistan pm sharif ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధం’’: పాకిస్తాన్ పీఎం షరీఫ్

‘‘భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధం’’: పాకిస్తాన్ పీఎం షరీఫ్

Sudarshan V HT Telugu

పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్ లకు, వారికి సపోర్ట్ చేస్తున్నవారికి వారు ఊహించని స్థాయిలో ప్రతీకార చర్యలు ఉంటాయని భారత ప్రధాని మోదీ హెచ్చరించిన నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.

పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ (HT_PRINT)

పహల్గామ్ ఉగ్రదాడిపై పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జమ్ముకశ్మీర్ జిల్లాలో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అబోటాబాద్ లోని మిలటరీ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు.

దుస్సాహసానికి పాల్పడితే..

అలాగే, దేశ సార్వభౌమత్వానికి, దాని ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలిగించే ఎటువంటి దుస్సాహసానికైనా వ్యతిరేకంగా పోరాడడానికి పాకిస్తాన్ దళాలు పూర్తి సామర్థ్యంతో, సిద్ధంగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 2019 లో భారత్ దుస్సాహసానికి సమాధానం ఇచ్చినట్టుగానే ఇకపై కూడా స్పందిస్తామన్నారు. అంతర్జాతీయంగా చేసే ఏ తటస్థ దర్యాప్తుకైనా సహకరించేందుకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కూడా న్యూయార్క్ టైమ్స్ కు తెలిపారు. "ఈ యుద్ధం రావాలని మేము కోరుకోవడం లేదు, ఎందుకంటే ఈ యుద్ధం ఈ ప్రాంతానికి విపత్తును కలిగిస్తుంది" అని ఆసిఫ్ అన్నారు.

భారత్ కఠిన చర్యలు

పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా పాకిస్తాన్ పై కఠిన చర్యలను భారత్ ప్రకటించింది. అట్టారీ సరిహద్దు వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్ ను మూసివేసి భారత్ లోని పాక్ హైకమిషన్ల సంఖ్యను తగ్గించింది. అట్టారీ భూ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశించిన పాక్ పౌరులందరినీ మే 1లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది.

పహల్గామ్ ఉగ్రవాదులకు ప్రధాని మోదీ వార్నింగ్

పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 'ఈ రోజు బిహార్ నేల నుంచి నేను యావత్ ప్రపంచానికి చెబుతున్నాను. ప్రతి ఉగ్రవాదిని, వారి మద్దతుదారులను భారత్ గుర్తించి, వెంటాడి శిక్షిస్తుంది. వారిని భూమి అంచుల వరకు వేటాడుతాం. ఉగ్రవాదంతో భారత స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. ఉగ్రవాదాన్ని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదు' అని ప్రధాని నొక్కి చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు, కుట్ర పన్నిన వారికి ఊహించిన దానికంటే పెద్ద శిక్ష తప్పదని హెచ్చరించారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.