ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు కృనాల్, హార్దిక్లతో కలిసి బరోడా తరఫున కూడా ఆడాడు ఈ 26ఏళ్ల క్రికెటర్.
క్రికెటర్తో రిలేషన్షిప్లో ఉన్న ఓ మహిళ.. రాజస్థాన్ జోధ్పూర్లోని కుడి భగత్సాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శివాలిక్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శివాలిక్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది.
వీరిద్దరూ రెండు నెలల క్రితం వడోదరలో కలుసుకున్నారని, ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడ్డాయని, అప్పటి నుంచి ఫోన్ ద్వారా టచ్లో ఉన్నారని తెలుస్తోంది.
బరోడాకు చెందిన ఈ క్రికెటర్ ఎడమచేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్. 2018లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 18 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 1,087 పరుగులు చేశాడు. శివాలిక్ 13 లిస్ట్ ఏ మ్యాచ్ లు, 19 టీ20లు ఆడి వరుసగా 322, 349 పరుగులు చేశాడు. లెగ్బ్రేక్ గూగ్లీ వెరైటీతో దేశవాళీ మ్యాచ్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.
శివాలిక్ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో బరోడా తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొన్నాడు.
2023 సీజన్కి ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో శివాలిక్ని ముంబై ఇండియన్స్ రూ.20 లక్షల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసింది. కానీ అతను గ్రౌండ్లో కనిపించలేదు. గత నవంబర్లో జరిగిన మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేసింది.
దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 15ఏళ్ల బాలికపై కదులుతున్న కారులో అత్యాచారం జరిగిన ఘటన తాజాగా హరియాణాలోని ఫరిదాబాద్లో చోటుచేసుకుంది.
పాఠశాలకు వెళ్తుండగా బాలికను అపహరించి కదులుతున్న కారులో రెండుసార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న బాధితురాలు శనివారం ఉదయం తన సోదరుడిని పాఠశాలకు డ్రాప్ చేసేందుకు వెళ్లింది.
సోదరుడిని దింపి బాలిక తన పాఠశాలకు వెలుతుండగా పార్కింగ్ చేసి ఉన్న ఓ కారులో కూర్చున్న ఓ వ్యక్తి విండో తెరిచి ఆమెను లోపలికి లాక్కెళ్లాడు. ఓ వ్యక్తి వాహనాన్ని నడుపుతుండగా, మరో వ్యక్తి తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్టు ఆమె వివరించింది.
పాఠశాల మూసేసే సమయంలో ఆమెను గ్రామ సమీపంలో కారులో నుంచి తోసేసి నిందితులు పరారయ్యారు. ఇంటికి చేరుకున్న ఆమె తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం