POCSO case on BS Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది! శుక్రవారం తెల్లవారుజామున.. కర్ణాటక సదాశివనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ మహిళ.. యడియూరప్పపై పోక్సో కేసు వేసినట్టు సమాచారం!
ఓ చీటింగ్ కేసులో సాయం కోరేందుకు మహిళ, ఆమె 17ఏళ్ల కూతురు.. ఫిబ్రవరి 2న బీఎస్ యడియూరప్ప దగ్గరికి వెళ్లినట్టు, అప్పుడే.. లైంగిక దాడి ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు.
"ఓ మహిళ నాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందని తెలిసింది. బహుశా.. నెల రోజుల ముందు అనుకుంటే, వాళ్లు వచ్చేవారు. నేను అంత పట్టించుకోలేదు. కానీ ఓరోజు, వాళ్లు ఏడుస్తున్నారని తెలిసింది. పిలిపించాను. వాళ్లు మోసపోయినట్టు చెప్పారు. పోలీస్ కమిషనర్ బీ దయానందకు ఫోన్ చేసి, వారి సమస్య గురించి తెలుసుకోమని చెప్పాను. అప్పటి నుంచి.. ఆమె నాకు వ్యతిరేకంగా అక్కడా, ఇక్కడా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె ఆరోగ్యం బాగోలేదేమో అనుకుని పోలీసులకు దర్యాప్తు చేయాలని చెప్పాను. కానీ ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంపై న్యాయపరంగానే ముందుకు వెళతాను. సాయం చేస్తే.. ఇలాంటి సమస్యలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. వాళ్లకి కొంత డబ్బులు కూడా ఇచ్చాను," అని యడియూరప్ప చెప్పారు.
BS Yediyurappa POCSO case : తనపై పడిన పోక్సో కేసు వెనుక రాజకీయ కుట్ర ఉండకపోవచ్చని, న్యాయపరంగా ముందుకు వెళతానని చెప్పారు యడియూరప్ప.
యడియూరప్పపై పోక్సో కేసు దాఖలైందన్న విషయాన్ని.. కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వర ధ్రువీకరించారు. కానీ ఇతర వివరాలను చెప్పేందుకు నిరాకరించారు.
"గురువారం రాత్రి.. మహిళ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చింది. వివరాలను పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిగేంతవరకు నేను ఇతర వివరాలను చెప్పలేను,"అని పరమేశ్వర చెప్పారు.
2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా యడియూరప్పపై ఇలాంటి ఆరోపణలు పడటం.. సర్వత్రా చర్చలకు దారితీసింది. ఈ వ్యవహారం.. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక బీజేపీ ప్రదర్శనపై ఏ మేరకు ప్రభావం పడుతుందో చూడాలి.
BS Yediyurappa latest news : కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు బీఎస్ యడియూరప్ప. చాలా కాలం పాటు.. బీజేపీకి వెన్నెముఖగా ఉన్నారు. 2008- 2011 వరకు కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. మే 2018లో కొన్ని రోజుల పాటు సీఎంగా పని చేసిన ఆయన.. జులై 2019-2021 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అనంతరం.. అనూహ్యంగా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వెనుక అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
బీఎస్ యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మై సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోనే.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళ్లింది బీజేపీ. కానీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో బొమ్మైని హవేరీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.
సంబంధిత కథనం