మ్మూ, సాంబా, పఠాన్కోట్లలో డ్రోన్లను గుర్తించారు. అధికారుల ప్రకారం, జమ్మూ ప్రాంతంలో వరుసగా రెండో రాత్రి కూడా నగరం అంధకారంలో మునిగిపోయింది. పేలుళ్ల శబ్దాలు, సైరన్లు వినిపించాయి. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్అవుట్ విధించారు.
జమ్మూ, సాంబా, పఠాన్కోట్ సెక్టార్లలో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రక్షణ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్థాన్ డ్రోన్లను అడ్డుకున్నప్పుడు సాంబాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ డివిజన్లోని ఉధంపూర్లో కూడా పూర్తి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. సైరన్లు వినిపిస్తున్నాయి. శ్రీనగర్లో ముందు జాగ్రత్త చర్యగా స్థానికులకు లైట్లు ఆపివేయమని తెలియజేశారు.
పేలుళ్ల శబ్దాల గురించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్లో పోస్ట్ చేశారు. 'జమ్మూలో ఇప్పుడు బ్లాక్అవుట్ అయింది. నగరం అంతటా సైరన్లు వినిపిస్తున్నాయి.' అని క్యాప్షన్ ఇస్తూ నగరం చీకటిలో ఉన్న చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.
'జమ్మూ, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి వీధుల్లోకి రాకండి, ఇంట్లో లేదా మీరు హాయిగా ఉండగలిగే దగ్గరి ప్రదేశంలో ఉండండి. పుకార్లను విస్మరించండి. ఆధారాలు లేని లేదా ధృవీకరించని కథనాలను వ్యాప్తి చేయవద్దు.' అని ఆయన మరొక పోస్ట్లో పేర్కొన్నారు.
గురువారం రాత్రి (మే 8) డ్రోన్లు, క్షిపణులతో సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను భారతదేశం వేగంగా తిప్పికొట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి ఉత్తర భారతదేశంలోని పలు నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తరువాత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. తర్వాత ఈ తేదీని మే 15 ఉదయం వరకు పొడిగించారు. జమ్మూ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
చండీగఢ్, శ్రీనగర్, అమృత్ సర్, లుధియానా, భుంతర్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, కాంగ్రా-గగ్గల్, బటిండా, జైసల్మేర్, జోధ్ పూర్, బికనీర్, హల్వారా, పఠాన్ కోట్, జమ్మూ, లెహ్, ముంద్రా, జామ్ నగర్, హిరాసా (రాజ్ కోట్), పోర్ బందర్, కేశోద్, కాండ్లా, భుజ్ విమానాశ్రయాలు మే 15 వరకు మూసివేస్తారు.