విమాన టికెట్ల ధరలపై ఎంపీల ఆందోళన.. అరగంట చర్చకు అవకాశం ఇస్తానన్న సభాపతి-flight ticket price concerns in parliament speaker to allow half an hour discussion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  విమాన టికెట్ల ధరలపై ఎంపీల ఆందోళన.. అరగంట చర్చకు అవకాశం ఇస్తానన్న సభాపతి

విమాన టికెట్ల ధరలపై ఎంపీల ఆందోళన.. అరగంట చర్చకు అవకాశం ఇస్తానన్న సభాపతి

HT Telugu Desk HT Telugu

అధిక విమాన ఛార్జీలపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ఈ అంశంపై సభలో అరగంట చర్చ నిర్వహించనున్నారు.

లోక్ సభ సభాపతి ఓం బిర్లా (Sansad TV)

న్యూఢిల్లీ: అధిక విమాన ఛార్జీలపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ఈ అంశంపై సభలో అరగంట చర్చ నిర్వహించనున్నారు. ఉడాన్ పథకం కింద చౌక విమాన ప్రయాణం అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలు అడిగారు. చాలా మంది ఎంపీలు ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలు వేయాలనుకున్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. 'చాలా మంది సభ్యులు ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. దీనిపై ఏదో ఒక రోజు సభలో అరగంట చర్చ జరుపుతాను..’ అని పేర్కొన్నారు.

శుక్రవారం ఇదే అంశంపై సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై కూడా చర్చిస్తామని, ఈ సమయంలో సభ్యులందరూ హాజరవుతారని ఆయన చెప్పారు. సభ్యుల ప్రశ్నలకు పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు చక్కగా సమాధానమిచ్చారని బిర్లా తెలిపారు.

ప్రశ్నోత్తరాల సమయంలో భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన రాజ్ కుమార్ రోట్ మాట్లాడుతూ ఒకే సమయంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకే విమానాన్ని బుక్ చేసుకుంటే ఛార్జీల్లో భారీ వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. విమాన ఛార్జీల నియంత్రణపై ప్రశ్నించారు. "ఈ రోజుల్లో మనకు డైనమిక్ విమాన ప్రయాణ విధానం ఉంది. అంతర్జాతీయ పద్ధతులను అనుసరిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి విమానయాన సంస్థలు ఛార్జీలను నిర్ణయిస్తాయి. ఆన్‌లైన్ టికెటింగ్ ఏజెన్సీలు అదనపు రుసుము వసూలు చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. సరసమైన ప్రయాణ సౌకర్యాలను అందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని, ఇందుకోసం ఉడాన్ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.

29 శాతం వరకు వ్యాట్

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై కొన్ని రాష్ట్రాలు 29 శాతం వరకు వ్యాట్ వసూలు చేస్తున్నాయని, తమిళనాడు అత్యధిక వ్యాట్ వసూలు చేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 15 రాష్ట్రాలు దీన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాయని, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఎక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నాయని, ఈ కారణంగా అక్కడ విమాన ఛార్జీలు ఖరీదైనవిగా మారాయని ఆయన అన్నారు. సభ్యులు తమ రాష్ట్రాల్లో ఏటీఎఫ్ పై వ్యాట్ ను తెలుసుకుని తగ్గించేందుకు ప్రయత్నించాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో విమానయాన రంగం అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. ఈ కాలంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 159కి పెరిగిన దేశం భారత్ తప్ప మరే దేశంలోనూ లేదని ఆయన అన్నారు. ఇప్పుడు కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందని, దేశంలో మరిన్ని విమానాలు అవసరమన్నారు. 2014కు ముందు దేశంలో 340 విమానాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 840కి పెరిగిందని తెలిపారు.

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.