ఈడీ ముంబై కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక డాక్యుమెంట్లు దగ్ధం!-fire guts eds mumbai office important documents lost to blaze know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఈడీ ముంబై కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక డాక్యుమెంట్లు దగ్ధం!

ఈడీ ముంబై కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక డాక్యుమెంట్లు దగ్ధం!

Anand Sai HT Telugu

ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న భవనాన్ని కైజర్-ఎ-హింద్ భవనం అని పిలుస్తారు. అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఈడీ ముంబై కార్యాలయంలో అగ్నిప్రమాదం (ANI Photo)

మహారాష్ట్రలో ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో ఆదివారం లెవల్-3 అగ్నిప్రమాదంలో పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న కైజర్-ఎ-హింద్ భవనంలో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

భారీగా పొగలు

తెల్లవారుజామున 2.30 గంటలకు మంటలు చెలరేగగా 4.21 గంటలకు లెవల్ 3కి పెరిగాయి. లెవల్ 3లో అగ్నిప్రమాదం జరిగిందని, భారీ పొగ కారణంగా మంటలను ఆర్పడం సవాలుగా మారిందని ముంబై అగ్నిమాపక దళం చీఫ్ ఫైర్ ఆఫీసర్ రవీంద్ర అంబుల్గేకర్ తెలిపారు.

'ఇది లెవెల్ 3 అగ్నిప్రమాదం. భారీ పొగలు రావడంతో మంటలను ఆర్పేందుకు సమయం పట్టింది. ఆ ప్రాంతం పెద్దది కావడంతో అన్ని వైపుల నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చింది.'అని రవీంద్ర తెలిపారు.

కీలక పత్రాలు దగ్ధం

అగ్నిప్రమాదంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఫర్నిచర్, ముఖ్యమైన డాక్యుమెంట్లతో సహా భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంబుల్గేకర్ తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఫర్నిచర్, కంప్యూటర్లు, పలు ముఖ్యమైన ప్రభుత్వ ఫైళ్లు దగ్ధమయ్యాయి. కైజర్-ఎ-హింద్ భవనంలో ఈడీ కార్యాలయం కాకుండా అనేక ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి.

మరో అగ్నిప్రమాదం

మరోవైపు మహారాష్ట్ర భివాండిలోని ప్లైవుడ్ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదం 24 గంటల పాటు కొనసాగి లక్షలాది రూపాయల విలువైన సామాగ్రి దగ్ధమైంది. మణి సూరత్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు నాలుగు అంతస్తుల కర్మాగారంలో అగ్నిప్రమాదం గురించి తమకు ఫోన్ వచ్చిందని చెప్పారు. సమాచారం అందుకున్న భివాండీ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గోడౌన్ శిథిలాలు కూలిపోయాయని, మంటలు ఇంకా ఉన్నాయని అధికారులు తెలిపారు. దాన్ని అదుపులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.