Kerala rape case : అసిస్టెంట్​ డైరక్టర్​పై దర్శకుడు అత్యాచారం- కేరళలో మరో కలకలం!-film director aide booked for raping assistant director in kerala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Rape Case : అసిస్టెంట్​ డైరక్టర్​పై దర్శకుడు అత్యాచారం- కేరళలో మరో కలకలం!

Kerala rape case : అసిస్టెంట్​ డైరక్టర్​పై దర్శకుడు అత్యాచారం- కేరళలో మరో కలకలం!

Sharath Chitturi HT Telugu
Oct 12, 2024 06:57 AM IST

Kerala assistant director raped : జస్టిస్​ హేమా కమిటీ నివేదికతో అట్టుడికిన కేరళ సినీ పరిశ్రమలో మరో దుమారం! దర్శకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ అసిస్టెంట్​ డైరక్టర్​ పేర్కొంది. అతని సహచరుడు సైతం లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసిస్టెంట్​ డైరక్టర్​పై దర్శకుడు అత్యాచారం!
అసిస్టెంట్​ డైరక్టర్​పై దర్శకుడు అత్యాచారం!

కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అసిస్టెంట్​ డైరక్టర్​పై సినీ దర్శకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకోసం అతని సహచరుడు సహకరించాడు.

ఇదీ జరిగింది..

కేరళలోని మరాడు పోలీసులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన మలయాళ సినీ దర్శకుడు, అతని అనుచరుడిపై కేసు నమోదు చేశారు.

నిందితులను దర్శకుడు సురేష్ తిరువళ్ల, అతని అనుచరుడు విజిత్ విజయకుమార్​గా గుర్తించారు.

చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్​గా పనిచేస్తున్న యువతికి అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సురేష్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై విజయకుమార్ సైతం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.

సురేష్ 'ఓర్మా', 'నలేకే' చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

ఇదీ చూడండి:- Bengaluru acid attack : ‘బట్టలు సరిగ్గా వేసుకోకపోతే యాసిడ్​ పోస్తా’- మహిళను బెదిరించి..

తమ స్టేషన్​లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ, మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖులపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తుందని మారాడు పీఎస్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

హేమా కమిటీ నివేదిక దుమారం..

2017లో కేరళ నటిపై జరిగిన లైంగిక దాడి ఉదంతంపై జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత పరిశ్రమలోని పలువురు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వానికి సమర్పించిన దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ నివేదిక విడుదలవ్వడం గమనార్హం.

కేరళలో మహిళా సినీ నిపుణుల పని పరిస్థితులపై ఆగస్టు 19న విడుదలైన ల్యాండ్ మార్క్ రిపోర్టులో అవకాశాలకు బదులుగా మహిళా ఆర్టిస్టులు, నటులు క్రమం తప్పకుండా లైంగిక ప్రయోజనాలు అడుగుతున్నారని, రాజీ పడమని చెప్పారని, వారి పురుష సహోద్యోగులు ప్రదర్శించిన బలప్రయోగంతో వ్యవహరించారని, దావా వేయడానికి ప్రయత్నిస్తే నిషేధిస్తామని బెదిరించారని పేర్కొంది. 295 పేజీల నిడివి ఉన్న ఈ కమిటీ నివేదికను 66 పేజీలకు కుదించి సాక్ష్యం చెప్పిన వారి పేర్లు, ఆరోపణలు చేసిన ఇతరుల వివరాలను సవరించారు.

ఈ నివేదిక విడుదలైన తరువాత, ఒక బెంగాలీ నటితో సహా పలువురు మహిళా యాక్టర్లు దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, ముఖేష్ సహా మలయాళ సినిమాలోని కొంతమంది ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.

సిద్దిఖీ, రంజిత్​లు.. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) ప్రధాన కార్యదర్శి, కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. మరోవైపు కేరళ ప్రభుత్వం ఆగస్టు 25న ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఐపీఎస్ ఉన్నతాధికారులతో సిట్​ను ఏర్పాటు చేసింది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా 'అమ్మ' అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ 17 మంది సభ్యులతో కూడిన కార్యవర్గం కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.