Delhi Farmers Protest: ‘కిసాన్ మహా పంచాయత్’ నేడే: దేశ రాజధానికి భారీగా రైతులు: డిమాండ్లు ఏవంటే!
Kisan Mahapanchayat in Delhi: ఢిల్లీలో నేడు రైతులు భారీ సభ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించేందుకు దేశ రాజధానిలో గళమెత్తనున్నారు.
Kisan Mahapanchayat in Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతులు మరోసారి గళమెత్తనున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన (Farmers Protest) చేపట్టనున్నారు. ఢిల్లీలో నేడు (మార్చి 20) సంయుక్త కిసాన్ మోర్చా (Samyukt Kisan Morcha) ఆధ్వర్యంలో భారీ సభ జరగనుంది. కిసాన్ మహాపంచాయత్ (Kisan Mahapanchayat) పేరిట రామ్లీలా మైదానంలో జరిగే ఈ సభలో వేలాది మంది రైతులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఢిల్లీకి భారీగా కర్షకులు చేరుకుంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రధాన డిమాండ్లివే..
Kisan Mahapanchayat in Delhi: పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (Minimum Support Price - MSP) హామీని అమలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం నినదించనున్నారు. విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ, రుణమాఫీ, గతంలో నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతున్నారు. ఢిల్లీ సరిహద్దులలో గతంలో నిర్వహించిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా జంతర్మంతర్ వద్ద సభ నిర్వహించాలని భావించినా.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కారణంగా పోలీసులు అనుమతించలేదని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. రామ్లీలా మైదానంలో అనుమతి ఇచ్చారని తెలిపారు.
Kisan Mahapanchayat in Delhi: పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ సహా మరిన్ని ఉత్తరాది రాష్ట్రాల నుంచి రైతులు నేడు ఢిల్లీలో జరిగే కిసాన్ మహా పంచాయత్కు హాజరుకానున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
Kisan Mahapanchayat in Delhi: రామ్లీలా మైదానంలో రైతుల సభ నేపథ్యంలో నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మహారాజ రాజ్నీత్ సింగ్ మార్గ్, మీర్దర్ద్ చౌక్, ఢిల్లీ గేట్, జేఎల్ఎన్ మార్గ్, మింటో రోడ్ ఆర్/ఎల్, కమలామార్కెట్, హమ్దర్ద్ చౌక్, అజ్మరీ గేట్, భవ్భుటి మార్గ్, చమన్ లాలా మార్గ్, పహడ్గంజ్ చౌక్ వద్ద కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ రోడ్లలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
ఆంక్షలు ఉండే మార్గాల గుండా ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవద్దని పోలీసులు సూచించారు. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఐఎస్బీటీకి వెళ్లాలనుకునే వారు ముందుగానే బయలుదేరాలని, ఈ మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సందర్భంగా 2020-2021 మధ్య రైతులు తీవ్ర పోరాటం చేశారు. దేశ రాజధాని సరిహద్దులో నెలల పాటు ఆందోళన చేశారు. లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. ఈ ఆందోళనల్లో కొందరు కర్షకులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. నెలల పాటు నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.