రోడ్డు పక్కన టీ అమ్ముకుంటున్న ఎకనామిక్స్​ గ్రాడ్యుయేట్​..!-failing to get a job economics graduate sells tea outside patna womens college ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రోడ్డు పక్కన టీ అమ్ముకుంటున్న ఎకనామిక్స్​ గ్రాడ్యుయేట్​..!

రోడ్డు పక్కన టీ అమ్ముకుంటున్న ఎకనామిక్స్​ గ్రాడ్యుయేట్​..!

HT Telugu Desk HT Telugu

బిహార్​: పట్నా వీధుల్లో ఓ ఎకనామిక్స్​ గ్రాడ్యుయేట్​.. టీ స్టాల్​ పెట్టుకుంది. ఎంత చదివినా.. ఉద్యోగం దొరకకపోవడంతో ఈ విధంగా సొంతంగా వ్యాపారం పెట్టుకుంది. ఆమె ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ప్రియాంక గుప్తా (ANI)

Economics graduate sells tea | ఆమె ఓ ఎకనామిక్స్​ గ్రాడ్యుయేట్​. ఎంతో కష్టపడి చదువుకుంది. కానీ ఉద్యోగం దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం దక్కలేదు. పోటీ పరీక్షలు సైతం రాసింది. కానీ అనుకున్నది జరగలేదు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. సొంతంగా వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంది. టీ స్టాల్​ పెట్టింది. ఇది.. బిహార్​కు చెందిన ప్రియాంక కథ!

బిహార్​ పూర్ణియాకు చెందిన ప్రియాంక గుప్తా.. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్​లో ఎకనామిక్స్​ నుంచి గ్రాడ్యుయేట్​ అయ్యింది. కానీ ఉద్యోగాలు దొరకలేదు. ఫలితంగా పట్నా ఉమెన్స్​ కాలేజీ ఎదురుగా.. ఓ టీ స్టాల్​ పెట్టింది. దానికి 'ఛాయ్​వాలీ' అనే పేరు పెట్టింది. 'ఆత్మనిర్భర్​ భారత్​ ఆవిష్కరణల్లో ఇదొకటి. ఎక్కువగా ఆలోచించకండి. పని మొదలుపెట్టేయండి,' అంటూ ఆ టీ స్టాల్​కు ఓ బోర్డు కూడా తగిలించింది.

ఇతర టీ దుకాణాల కన్నా తన స్టాల్​ ప్రత్యేకంగా ఉండాలని భావించింది ప్రియాంక. ఈ క్రమంలోనే పాన్​ టీ, చాక్లెట్​ టీ అంటూ నాలుగు కొత్త రకాల టీలను పరిచయం చేసింది.

"2019లో నేను గ్రాడ్యుయేట్​ అయ్యాను. రెండేళ్లుగా ఉద్యోగం గురించి తీవ్రంగా ప్రయత్నించాను. బ్యాంకు పరీక్షలు కూడా రాశాను. కానీ ఫలితం దక్కలేదు. ఇంటికి వెళ్లిపోవడమే నాకు దిక్కు అనిపించింది. కానీ వెళ్లలేదు. దాని బదులు పట్నాలో.. ఓ తోపుడు బండి మీద టీ స్టాల్​ పెట్టాను. నాకు వేరే ఆలోచనలు లేవు. నేనేమీ సిగ్గుపడటం లేదు. ఇదొక వ్యాపారంలాగా భావిస్తున్నాను, ఆత్మనిర్భర్​ భారత్​లో ఇది ఓ భాగం. చాలా మంది ఛాయ్​వాలాలు ఉన్నారు. కానీ ఛాయ్​వాలీలు ఎందుకు లేరు? అని అనిపించింది. వెంటనే వ్యాపారం మొదలుపెట్టేశాను," అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

టీ అమ్ముతున్న ప్రియాంక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వెంటనే వైరల్​గా మారిపోయాయి. ఆమె ఆత్మస్థైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకం అని కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో దేశంలో నిరుద్యోగ సమస్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. "దేశంలో ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రజలకు సరైన తిండి దొరకడం లేదు. కానీ మనం మాత్రం.. హిందు- ముస్లిం పేర్లతో కొట్టుకుంటున్నాము. అల్లర్లు, ఘర్షణలే పత్రికల్లో హెడ్​లైన్స్​లో ఉంటున్నాయి. మరో 50ఏళ్లల్లో మనం ఆఫ్రికాలాగా మారాలా? లేక అమెరికాను అందుకోవాలా? ఇది ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రజలపైనే ఇది ఆధారపడి ఉంటుంది," అని ఓ నెటిజన్​ రాసుకొచ్చారు.

'దేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు.. మోదీజీ ఈ విధంగా యువతను ప్రోత్సహిస్తున్నారు,' అంటూ మరో వ్యక్తి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.