SM Krishna : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ కన్నుమూత-ex karnataka chief minister sm krishna dies at 92 due to severe health issues ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sm Krishna : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ కన్నుమూత

SM Krishna : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ కన్నుమూత

Sharath Chitturi HT Telugu
Dec 10, 2024 07:24 AM IST

SM Krishna news : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. అనారోగ సమస్యల కారణంగా సోమవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ సోమవారం అర్ధరాత్రి బెంగళూరులో కన్నుమూశారు. నెల రోజులుగా ఆరోగ్యం బాగా క్షీణించిన నేపథ్యంలో బెంగళూరు సదాశివనగర్​లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎస్ఎం కృష్ణ పార్థివదేహానికి, ఆయన స్వగ్రామం మద్దూరులోని సోమనహళ్లిలో బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

yearly horoscope entry point

92 ఏళ్ల కృష్ణకు భార్య ప్రేమ కృష్ణ, కుమార్తెలు శాంభవి- మాళవిక ఉన్నారు. ఎస్​ఎం కృష్ణ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత.

సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం..

ఆరున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఎస్ఎం కృష్ణ వయసు సంబంధిత సమస్యలతో 2023 జనవరి 7న రాజకీయాలకు వీడ్కోలు పలికారు. ఇటీవలే, కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కృష్ణ 2024 అక్టోబర్ 19న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా సోమవారం అర్థరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

ఎస్​ఎం కృష్ణ వయసు ఇప్పుడు 92 సంవత్సరాలు. గత నెలలో కూడా ఆయన మైసూరుతో సహా వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృష్ణ ఏప్రిల్ చివరి వారంలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన భార్య, పిల్లలు, మనవరాళ్లు ఎస్​ఎం కృష్ణను చూసుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

చిరునవ్వుతో ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయాలకు మారుపేరైన ఎస్ ఎం కృష్ణ ఎమ్మెల్యే, ఎంపీ, కర్ణాటకలో మంత్రిగా, స్పీకర్​గా, ఉపముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడిగా, కేంద్రంలో మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్​గా వివిధ బాధ్యతలు చేపట్టారు. ఎస్ ఎం కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'నేలాడ సిరి' విడుదలైంది.

ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవం-2021ను కృష్ణ ప్రారంభించారు.

మండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లిలో జన్మించిన కృష్ణ తండ్రి మల్లయ్య కూడా రాజకీయాల్లో సుపరిచితులే. మద్దూరు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎస్​ఎం కృష్ణ కాంగ్రెస్​లో ఉన్నత పదవులు నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన బెంగళూరు అభివృద్ధికి కూడా కృషి చేశారు. ఆయన కేంద్రంలో పరిశ్రమల మంత్రిగా, విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్​లోనే గడిపిన కృష్ణ ఏడేళ్ల క్రితం బీజేపీలో చేరారు.

క్రమశిక్షణతో కూడిన జీవితానికి మారుపేరైన కృష్ణ కొన్నేళ్ల క్రితం అల్లుడు సిద్ధార్థ హెగ్డే ఆత్మహత్య చేసుకోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్​ఎం కృష్ణ మనవడి వివాహం గత ఏడాది డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుమార్తెతో జరిగింది.

ఎస్​ఎం కృష్ణ మృతి పట్ల కర్ణాటక కాంగ్రెస్​, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్లు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.