ఇస్రో కొత్త శాటిలైట్​ లాంచ్​ ఫెయిల్​- 2017 తర్వాత తొలిసారి..-eos 09 mission what isro said on the failed satellite launch ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇస్రో కొత్త శాటిలైట్​ లాంచ్​ ఫెయిల్​- 2017 తర్వాత తొలిసారి..

ఇస్రో కొత్త శాటిలైట్​ లాంచ్​ ఫెయిల్​- 2017 తర్వాత తొలిసారి..

Sharath Chitturi HT Telugu

ఈఓఎస్​ 09 ఉపగ్రహంతో కూడిన పీఎస్​ఎల్వీ రాకెట్​ని ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 5.59 గంటలకు ప్రయోగించారు. కొంతసేపటికే ఇది నియంత్రణ కోల్పోయింది. ఫలితంగా మిషన్​ ఫెయిల్​ అయ్యింది.

ఈఓఎస్​ 09 శాటిలైట్​ (ISRO - X)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎదురుదెబ్బ! ఈఓఎస్​- 09 ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​తో కూడిన పీఎస్​ఎల్వీ- సీ61 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) లాంచ్​ విఫలమైంది! ఫలితంగా ఈ మిషన్​ని ఇస్రో రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్​ వీ నారాయణ్​ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 5:59 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈఓఎస్-09ను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 101వ ఉపగ్రహ ప్రయోగం. కాగా నింగిలోకి ఎగిరిన అనంతరం, 3వ దశ వచ్చేసరికి ప్రొపల్షన్​ సిస్టెమ్​లో లోపం కారణంగా రాకెట్​ నియంత్రణ కోల్పోయిందని తెలుస్తోంది.

రాకెట్​ నింగిలోకి ఎగిరిన 203వ సెకండ్​లో హెచ్​టీపీబీ (హైడ్రాక్సైల్​ టెర్మినేటెడ్​ పాలీబుటాడయీన్​) ప్రొపలెంట్​ సరిగ్గా పనిచేయలేదని సమాచారం. అందుకే రాకెట్​ విఫలమైంది. పీఎస్​ఎల్వీ రాకెట్​ పూర్తిస్థాయిలో విఫలం అవ్వడం (63 లాంచ్​లలో) ఇది 3వసారి. 2017 నుంచి తొలిసారి.

“ఈఓఎస్​-09తో కూడిన పీఎస్​ఎల్​వీ సీ61 ఈరోజు శ్రీహరికోట నుంచి 101వ లాంచ్​కి ప్రయత్నించాము. మొత్తం 4 దశలు ఉంటాయి. 2వ దశ వరకు అంతా బాగానే జరిగింది. 3వ దశ పర్ఫెక్ట్​గా ప్రారంభమైంది. కానీ సరిగ్గా పనిచేయలేదు. మిషన్​ని పూర్తి చేయలేకపోయాము. పరిస్థితి విశ్లేషించి మళ్లీ ప్రయోగిస్తాము,” అని ఇస్రో ఛైర్మన్​ అన్నారు.

ఫ్లైట్​ డేటాను ఇంజినీర్లు విశ్లేషిస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నారు. పీఎస్​3 స్టేజ్​ పనితీరులో లోపాలపై దర్యాప్తు చేసేందుకు కమిటీ కూడా ఏర్పడింది.

ఈఓఎస్​-09.. జాతీయ భద్రతకు కీలకం!

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) తన 63వ మిషన్​లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-09)ను మోసుకెళ్లింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో భూమి ఉపరితలానికి సంబంధించిన హై-రిజల్యూషన్ చిత్రాలను తీయగలదు.

వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రతకు ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.

సుమారు 1,696.24 కిలోల బరువున్న ఈ ఇస్రో ఈఓఎస్-09 ఉపగ్రహం దేశంలోని విస్తృత భూభాగం అంతటా మెరుగైన రియల్ టైమ్ కవరేజీని అందించడానికి రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాల సమూహంలో భాగం అవ్వాల్సి ఉంది.

మిషన్​ విఫలం అవ్వడంతో భారత దేశ సరిహద్దు నిఘా ప్రణాళికలు మరింత ఆలస్యం అవ్వనున్నాయి.

రిశాట్-1 ఉపగ్రహానికి కొనసాగింపుగా ఇస్రో ఈ ఈఓఎస్-09 (రిశాట్-1బీ) తీసుకొచ్చింది. రిసోర్స్ శాట్, కార్టోశాట్, రిశాట్-2బీ సిరీస్ ఉపగ్రహాల డేటాను ఇది భర్తీ చేయాల్సి ఉంది.

ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-09 అనేది 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 పునరావృత ఉపగ్రహం. ఆపరేషనల్ అప్లికేషన్లలో నిమగ్నమైన యూజర్ కమ్యూనిటీకి రిమోట్ సెన్సింగ్ డేటాను నిర్ధారించడం, పరిశీలన ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడం అనే మిషన్ లక్ష్యంతో దీనిని రూపొందించింది ఇస్రో.

ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ నారాయణన్ శుక్రవారం తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నారాయణన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పీఎస్ఎల్వీ-సీ61 నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి మిషన్ విజయవంతం, భద్రత కోసం ఆశీస్సులు తీసుకున్నారు.

రిశాట్-1 ఉపగ్రహానికి ఈఓఎస్-09 అనుసరణ అని ఇస్రో మాజీ శాస్త్రవేత్త మనీష్ పురోహిత్ అన్నారు. ఈ ప్రయోగం వ్యూహాత్మకంగా సమయానుకూలంగా జరిగిందని చెప్పారు.

“సరిహద్దు, తీర ప్రాంతాలు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ ఈఓఎస్​-09 మానిటరింగ్​ చేస్తుంది. ఏ కదలికలైనా పసిగట్టేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఇది ఉపయోగపడుతుంది. పహల్గామ్​ ఉగ్రవాది, ఆపరేష్​ సిందూర్​ తర్వాత ఈ తరహా శాటిలైట్​ అవసరం ఉంది,” అని ఆయన అన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.