Supreme court on EC: ఎన్నికల సంఘానికి ‘ఆయన’ లాంటి కమిషనర్ అవసరం!: సుప్రీం కోర్టు-election commission of india needs a person like tn seshan supreme court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Election Commission Of India Needs A Person Like Tn Seshan Supreme Court

Supreme court on EC: ఎన్నికల సంఘానికి ‘ఆయన’ లాంటి కమిషనర్ అవసరం!: సుప్రీం కోర్టు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2022 10:51 AM IST

Supreme court on EC: భారత ఎన్నికల సంఘం గురించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్ల నియామక తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈసీ స్వాతంత్య్రం దెబ్బ తింటోందని అభిప్రాయపడింది.

సుప్రీం కోర్టు (ANI Photo)
సుప్రీం కోర్టు (ANI Photo)

Supreme court on Election Commission: భారత ఎన్నికల సంఘం (ECI) స్వతంత్ర ప్రతిపత్తిని వరుసగా అన్ని ప్రభుత్వాలు దెబ్బ తీస్తూనే ఉన్నాయని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)లకు పూర్తి ఆరు సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం లేదని గుర్తు చేసింది. ఎలక్షన్ కమిషనర్ల నియామకం కోసం చట్టం లేకపోవడం ముప్పుగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామక పద్ధతిలో సంస్కరణలు తీసుకురావాలని దాఖలైన పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఆ సుప్రీం ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

“ఛీప్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎలా ఎంపిక చేయాలన్న విషయంపై రాజ్యాంగంలో నిర్దిష్టమైన చట్టం లేదు. దీన్ని రాజకీయ పార్టీలు వినియోగించుకొని నిమాయమాకాలు చేస్తున్నాయి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Supreme court on Election Commission: ఏ ప్రభుత్వమైనా ఇలాగే..

“ఇది చాలా ఆందోళన కలిగించే ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 వరకు సీఈసీగా ఉన్నారు) తర్వాతి నుంచి పతనం ప్రారంభమైంది. ఏ వ్యక్తికి కూడా పూర్తిస్థాయి పదవీ కాలం (సీఈసీగా) ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయంటే.. వాటికి డేట్ ఆఫ్ బెర్త్ లు తెలుసు. అందుకే ఎవరైతే ఆరు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగే అవకాశం లేదో వారినే సీఈసీగా నియమిస్తున్నాయి. అది యూపీఏ (కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్) అయినా.. ఈ ప్రభుత్వమైనా, ఈ ధోరణే కొనసాగుతోంది” అని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

భారత ఎన్నికల సంఘానికి హెడ్‍గా ఇప్పుడు టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి కావాలనేలా దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈసీకి ‘బెస్ట్ మ్యాన్’ను నియమించేలా ప్రక్రియ ఉండాలని బెంచ్ పేర్కొంది.

1990 డిసెంబర్ 12వ తేదీన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా టీఎన్ శేషన్ నియమితులయ్యారు. 1996 డిసెంబర్ 11 వరకు పదవిలో కొనసాగారు. తన పదవీ కాలంలో ఎన్నికల సంఘంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు శేషన్. ఎన్నికల సంఘం చరిత్రలో ఆయను అత్యుత్తమ సీఈసీగా చాలా మంది శ్లాఘిస్తుంటారు. టీఎన్ శేషన్ 2019 నవంబర్ లో కన్నుమూశారు.

కొత్త పక్రియ అవసరం లేదు: కేంద్రం

ఎన్నికల సంఘం కమిషనర్ల ప్రక్రియ ఇంత కాలం సవ్యంగానే సాగిందని, ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంలో వాదనలు వినిపించింది. కమిషనర్ల నియామకానికి కొత్త విధానం అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సీఈసీల ఎంపికకు కొలిజియమ్ లాంటి వ్యవస్థ ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

IPL_Entry_Point

టాపిక్