ఉత్తర్ప్రదేశ్ లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు?’ అని అడిగిన ఓ వృద్ధురాలిని, ఓ 22ఏళ్ల వ్యక్తి కిరాతకంగా కొట్టి చంపేశాడు.
మార్చ్ 15న లక్నోలోని గోసాయిగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
"తుషాల్ అలియాస్ విశాల్ వర్మ.. పబ్లిక్లో మూత్రం పోశాడు. అదే సమయంలో 62ఏళ్ల జాగ్రానా అతడిని అడ్డుకుంది. బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు అని అడిగింది. వారిద్దరి మధ్య అది అప్పటికే రెండో సంఘటన. తుషాల్కి చాలా కోపం వచ్చింది. గోసాయిగంజ్లోని ఒక పాడుబడిన ఇంట్లోకి వృద్ధురాలిని లాక్కెళ్లాడు. మెటల్ రాడ్తో ఆమె తల, ముఖాన్ని చాలాసార్లు కొట్టాడు. ఇటుకతో ఆమె తలపై దాడి చేశాడు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది," అని డీసీపీ సౌత్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు.
ఎల్ఎల్బీ స్టూడెంట్ అయిన నిందితుడు మెటల్ రాడ్ని, ఇటుకను ఘటనాస్థలానికి దూరంగా పడేశాడు. పోలీసులకు అవి దొరకకుండా ఉంటే, తాను చేసిన నేరం నుంచి తప్పించుకోవచ్చని భావించాడు.
మరోవైపు, తన భార్య కనిపించడం లేదని జాగ్రానా భర్త జగ్మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటిరోజు ఆమె మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లో గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తొలుత వారికి ఆషారామ్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. హోలీ రోజున జగ్మోహన్కి ఆషారామ్కి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలుసుకున్నారు. గొడవతోనే ఆషారామ్.. జాగ్రానాను చంపేశాడా? అని అనుమానించారు. కానీ ఆషారామ్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది.
అసలు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. వృద్ధురాలు అదృశ్యమైన రోజున ఓ దుకాణం దగ్గర ఆమె నిలబడ్డ దృశ్యాలు, ఆమెకు సమీపంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడి దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. ఆ యవకుడి గురించి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
యువకుడి పేరు తుషాల్ అని గత కొన్ని రోజులుగా అతను ఇంటికి వెళ్లలేదని పోలీసులకు తెలిసింది. వెంటనే అతడిని పట్టుకునేందుకు కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేకి సమీపంలో శనివారం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా తుషాల్ నిజాన్ని ఒప్పుకున్నాడు. పబ్లిక్లో మూత్రం పోస్తున్నందుకు ప్రశ్నించిందన్న కారణంతో వృద్ధురాలని చంపేసినట్టు పోలీసులకు వెల్లడించాడు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. మూత్రవిసర్జనం ఎందుకు చేస్తున్నావు? అని అడిగినంతమాత్రానా చంపేస్తారా? అని పలువురు షాక్ అవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం