Mangoes on EMI : ఫోన్, ఫ్రిడ్జ్, టీవీ.. ఇలా ఎన్నో వస్తువులకు ఇప్పుడు 'ఈఎంఐ' ఆప్షన్లు లభిస్తున్నాయి. 'బై నౌ- పే లేటర్' ఆప్షన్ను కస్టమర్లు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. ఇది సాధారణమైన విషయమే. అయితే.. మీరు ఎప్పుడైనా పండ్లను ఈఎంఐలో కొనుగోలు చేశారు? విక్రయదారులెవరైనా.. మీరు కొనే పండ్లకు 'బై నౌ- పే లేటర్' ఆప్షన్ ఇచ్చారా? “ఏంటిది వింతగా ఉంది..” అని అనుకుంటున్నారా? ఇది నిజమే.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.. తన మామిడి పండ్లకు ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
వేసవి వస్తోందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే! ఈ పండ్లను రుచి చూసేందుకు ఏడాది పొడవునా ఎదురుచూసే వాళ్లు చాలా మందే ఉంటారు. అదే సమయంలో డిమాండ్కు తగ్గట్టు ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పుణెకు చెందిన ఓ వ్యాపారికి ఓ ఐడియా వచ్చింది. అదే.. మామిడి పండ్లను ఈఎంఐ ద్వారా విక్రయించడం.
Mangoes on EMI in Pune : మామిడి పండ్లను ఈఎంఐ ద్వారా విక్రయిస్తున్నాడు గౌరవ్ సనస్ అనే వ్యాపారి. ఇందుకోసం పేటీఎంతో టైఅప్ కూడా అయ్యాడు. గౌరవ్.. గత 12ఏళ్లుగా మామిడ పండ్ల విక్రయం బిజినెస్లో ఉన్నాడు. పుణె సన్సిటీ రోడ్లోని ఆనంద్ నగర్లో అతనికి ఓ దుకాణం ఉంది. ఈ ఏడాదే కొత్తగా ఈ ఈఎంఐ ఆప్షన్ను ప్రవేశపెట్టాడు.
"కొవిడ్ రోజుల్లో ప్రజలకు జీతాలు తగ్గిపోయాయి. చాలా మందికి మామిడి పండ్లు కొనేందుకు డబ్బులే లేవు. పిల్లలకు మామిడి పండ్లు కొనలేని పరిస్థితి చూసి బాధ కలిగింది. ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే ఈ ఈఎంఐ ఐడియా వచ్చింది. పేటీఎంతో పరిస్థితిని వివరించాను. ఈఎంఐ ఆప్షన్ వెసులుబాటును ఇచ్చేందుకు పేటీఎం ముందుకొచ్చింది," అని వివరించారు గౌరవ్.
Buy mangoes on EMI option : అయితే.. ఈ ఈఎంఐ ఆప్షన్లు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. సంబంధిత వ్యక్తికి డెబిట్/ క్రెడిట్ కార్డ్లు ఉండాలి. ఆ బ్యాంక్.. సంబంధిత వ్యక్తికి 3-12 నెలల వరకు ఇన్స్టాల్మెంట్ వెసులుబాటును కల్పించాలి.
గౌరవ్కు వచ్చిన ఐడియా బాగా క్లిక్ అయ్యింది. చాలా మంది ఈఎంఐ ద్వారా మామిడి పండ్లను కొనేందుకు ముందుకొస్తున్నారు. ఓ వ్యక్తి.. ఏకంగా రూ. 30వేలు విలువ చేసే మామిడి పండ్లను కొన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఏడాది పొడవునా.. నెలకు రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం