టిబెట్ని భారీ భూకంపం కుదిపేసింది! మంగళవారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. టిబెట్లో భూకంపం కారణంగా అటు నేపాల్తో పాటు ఇటు భారత్లోని దిల్లీ-ఎన్సీఆర్, బీహార్, అసోంలో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.
వాస్తవానికి తొలుత నేపాల్- టిబెట్ సరిహద్దులో భూకంపం సంభవించిందని కథనాలు వెలువడ్డాయి. అయితే, యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం టిబెట్లోని జిజాంగ్కు సమీపంలో, 10కి.మీల లోతులో భూకంపం వచ్చింది. ఈ ప్రాంంతం నేపాల్కి సమీపంలో ఉంది.
అయితే చైనా భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ మాత్రం మంగళవారం తెల్లవారుజామున టిబెట్ రాజధాని లాసాకు 380 కి.మీల దూరంలో 6.8 తీవ్రతతో భూమి కంపించిందని నివేదించింది. ఆ ప్రాంతంలో చాలా మంది నివాసముంటున్నట్టు వెల్లడించింది.
అయితే.. తాజా భూకంపానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు.
ఏదిఏమైనా నేపాల్ మాత్రం భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. ఖాట్మాండూలో సైతం ప్రకంనలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్కి సమీపంలోని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు నిద్రలో నుంచి లేచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
నేపాల్ ఒక ప్రధాన భౌగోళిక “ఫాల్ట్ లైన్”పై ఉంది. ఇక్కడ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్- యురేషియా ప్లేట్లోకి నెట్టడం జరుగుతుంది. ఫలితంగా క్రమం తప్పకుండా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
2015లో నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9,000 మంది మరణించగా, 22,000 మందికి పైగా గాయపడ్డారు.
ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందంటే.. టిబెట్లో సంభవించిన భారీ భూంకపం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బీహార్లో ఫ్యాన్లు, సీలింగ్కి వేలాడుతున్న బల్బులు ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భూకంపం ధాటికి, అప్పటివరకు నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా నిద్రలేచి, బయటకు పరుగులు తీశారు.
సంబంధిత కథనం
టాపిక్