2005లో రాజకీయ విబేధాలతో విడిపోయిన ఠాక్రే కుటుంబం చివరకు తమ విభేదాలను పక్కన పెట్టనున్నారా? రాజకీయంగా ఠాక్రే కుటుంబానికి మునపటి ప్రజాదరణ సంపాదించడానికి ఒక్కటవబోతున్నారా? వారి మెగా రీయూనియన్ గురించి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మరాఠీ అస్తిత్వానికి, సంస్కృతికి ముప్పు పొంచి ఉందన్న వాదనల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ థాక్రే ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వేరు వేరు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఇటీవలి రోజులలో వివిధ సందర్భాల్లో మాట్లాడిన శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే తమ ఉమ్మడి లక్ష్యాన్ని వెల్లడించారు. తమ విబేధాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వారు స్పష్టం చేశారు. అందుకోసం తమ మధ్య విబేధాలను పక్కన పెట్టడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తో ఇటీవల పాడ్ కాస్ట్ లో రాజ్ ఠాక్రే తన ఉద్దేశాన్ని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి పనిచేయడంపై మాట్లాడారు. తనకు, ఉద్ధవ్ కు మధ్య ఉన్న విబేధాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే పెద్దవని ఆయన అన్నారు. ‘‘ఉద్ధవ్, నాకు మధ్య వివాదాలు, గొడవలు చిన్నవి. మహారాష్ట్ర అన్నింటికంటే చాలా పెద్దది. ఈ విభేదాలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజల మనుగడకు అడ్డంకిగా రుజువవుతున్నాయి. కలిసి రావడం కష్టమేమీ కాదు. అది సంకల్పానికి సంబంధించిన విషయం. రాజకీయ పార్టీలకు అతీతంగా మరాఠీ ప్రజలంతా ఏకమై ఒకే పార్టీని ఏర్పాటు చేయాలి' అని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఇలాంటి విషయాలకు తన అహాన్ని అడ్డు రానివ్వను అన్నారు.
ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడో భాషగా చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు మళ్లీ కలిసేందుకు అవకాశం ఏర్పడింది. హిందీని తప్పని సరి చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఇది అమలు కాకుండా చూస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఎంఎన్ఎస్ సహించదని స్పష్టం చేశారు. ప్రతిదీ 'హిందీ-ఫై' చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలను ఈ రాష్ట్రంలో విజయవంతం కానివ్వం' అని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. 'హిందీ జాతీయ భాష కాదు. ఇది దేశంలోని ఇతర భాషల మాదిరిగానే రాష్ట్ర భాష. మొదటి నుంచి మహారాష్ట్రలో ఎందుకు బోధించాలి? మీ త్రిభాషా సూత్రం ఏదైనప్పటికీ, దాన్ని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేయండి, దాన్ని విద్యకు తీసుకురావద్దు' అని హితవు పలికారు.
హిందీని రుద్దడంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయడాన్ని తమ పార్టీ అనుమతించదని శివసేన నేత శనివారం స్పష్టం చేశారు. ‘‘మీరు (మమ్మల్ని) ఆప్యాయంగా అడిగితే మేం అన్నీ చేస్తాం, కానీ మీరు ఏదైనా రుద్దితే మేం వ్యతిరేకిస్తాం’’ అన్నారు.