పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం చేసిన సిఫార్సుల మేరకు మే7, బుధవారం 'సెక్యూరిటీ మాక్ డ్రిల్స్'ని నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలోనే రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చివరిసారిగా దేశంలో 1971 యుద్ధానికి ముందు ఈ తరహా డ్రిల్ జరిగింది! నాటి యుద్ధంలో భారత్ చేతిలో పాక్ ఓడిపోవడమే కాదు, బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఉద్భవించింది.
కాగా మే 7, బుధవారం నాడు జరిగే సెక్యూరిటీ డ్రిల్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్లో ఈ డ్రిల్ జరుగుతుంది. గ్రామ స్థాయిల నుంచి డ్రిల్ నిర్వహణకు ప్రణాళికలు రచించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా, వాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాలు సన్నద్ధంగా ఉండేందుకు ఈ మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుంది.
"ఈ డ్రిల్లో జిల్లా కంట్రోలర్, జిల్లా అధికారులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్, కాలేజీ- స్కూల్ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి," అని హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో ఉంది. "తీవ్ర విపత్కర పరిస్థితుల"ను ఎదుర్కొనే విధంగా పౌరులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.
మే 7న జరిగే మాక్ డ్రిల్లో ఏం చేయాలో కూడా హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో ఉంది.
మాక్ డ్రిల్లో.. ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టెమ్ ఎంత మెరుగ్గా పనిచేస్తుందో చెక్ చేయాలి. అదే సమయంలో వాయుదాడులకు ఎలాంచి చర్యలు చేపట్టాలో ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. వాయుసేనతో హాట్లైన్స్, రేడియో కమ్యూనికేషన్ లైన్లు యాక్టివ్గా ఉంటాయి. వాటిని చెక్ చేయాలి. కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ కార్యకలాపాలను, పనితీరును చెక్ చేయాలి. అవాంఛనీయ, విపత్కర, ప్రతికూల దాడులు సంభవిస్తే తమను తాము కాపాడుకునే విధంగా పౌరులు, విద్యార్థులను ట్రైన్ చేయాలి.
ఈ సెక్యూరిటీ డ్రిల్లో భాగంగా 'బ్లాకౌట్స్' కూడా కనిపించవచ్చు. సాధారణంగా వాయుదాడులు జరిగే సమయంలో ఇలాంటి చర్యలు చేపడతారు. బ్లాకౌట్ తరహా పరిస్థితులను క్రియేట్ చేసేందుకు లైట్లు స్విచాఫ్ చేయాలని అధికారులు ప్రజలను కోరవచ్చు.
సెక్యూరిటీ మాక్ డ్రిల్లో భాగంగా.. శత్రువుల కాల్పుల నుంచి కీలక స్థావరాలను (ఎయిర్ఫీల్డ్, రిఫైనరీలు, రైల్ యార్డులు) రక్షించేందుకు, వాటిని కప్పివేస్తారు. తరలింపు ప్రక్రియలను ఎంత మెరుగ్గా, వేగంగా చేపడుతున్నాయో చూసేందుకు రెస్క్యూ టీమ్లను పరీక్షిస్తారు. దాడి ముప్పు ప్రాంతాల నుంచి పౌరులను వేగంగా, సేఫ్టీ జోన్లకు తరలించడం కూడా మే7, బుధవారం నాడు జరగనున్న ఈ మాక్ డ్రిల్లో భాగం. ప్రాథమిక చికిత్స, మంటలు ఆర్పడం, షెల్టర్ టెక్నిక్స్ని పౌరులకు కూడా నేర్పిస్తారు.
జమ్ముకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది చనిపోయారు. అప్పటి నుంచి భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. కానీ భారత్వైపు నుంచి మిలిటరీ యాక్షన్ కూడా ఉంటుంది స్వయంగా పాకిస్థాన్ భావిస్తోంది. అందరు 'యుద్ధం' గురించి మాట్లాడుకుంటున్న వేళ.. 1971 తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండటం వార్తల్లో నిలిచింది.
సంబంధిత కథనం