Delhi Murder: ఢిల్లీలో దారుణ హత్య: 16 ఏళ్ల అమ్మాయిని 20సార్లు పొడిచి చంపిన బాయ్ఫ్రెండ్.. కళ్లప్పగించి చూసిన స్థానికులు
Delhi Murder: ఢిల్లీలో కిరాతక హత్య జరిగింది. ఓ 16ఏళ్ల అమ్మాయిని తన బాయ్ఫ్రెండ్ కత్తితో పొడిచి పొడిచి హత్య చేశాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.
Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్య జరిగింది. 16 ఏళ్ల అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ కిరాతకంగా హత్య చేశాడు. నడివీధిలో జనాలు చూస్తుండగా చాలాసార్లు కత్తితో ఆమెను పొడిచాడు. రోహిణికి సమీపంలోని షహ్బాద్ డెయిరీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
ఆ అమ్మాయిని తన బాయ్ఫ్రెండ్ కిరాతకంగా కత్తితో చాలాసార్లు పొడిచాడు. కిందపడిన ఆమెను బండరాయితో బాదాడు. కాలితో దారుణంగా తన్నాడు. ఆ సమయంలో అక్కడ కొందరు స్థానికులు ఉన్నా.. ఎవరూ కనీసం అతడిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. కళ్లప్పగించి చూశారే తప్ప అడ్డుకోలేదు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని సాహిల్గా పోలీసులు గుర్తించారు.
స్నేహితురాలి కుమారుడి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా.. ఆ అమ్మాయిను అడ్డగించిన సాహిల్ విచారక్షణారహితంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. చిన్న గొడవ జరిగాక అతడు ఈ కిరాతకానికి పాల్పడినట్టు వెల్లడించారు.
“వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. నిన్న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు ఆమె సిద్ధమైంది. ఆమెను అతడు ఫాలో అయి.. చాలాసార్లు కత్తితో పొడిచాడు. బండరాయితో కొట్టాడు” అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
నిందితుడు సాహిల్ను ఉత్తర ప్రదేశ్లోని బులందర్ షెహర్లో పట్టుకున్న పోలీసులు ఢిల్లీకి తరలించారు.
కల్యాణ్పురిలో..
కాగా, ఢిల్లీలోని కల్యాణ్పురిలో గత శనివారం ఓ హత్య జరిగింది. ఓ 18 ఏళ్ల యువకుడిని ఓ ఐదుగురు కత్తులతో పొడిచి చంపారు. ఏకంగా 21సార్లు అతడిని పొడిచి హత్య చేశారు. ఆ మృతుడికి, ఆ గ్యాంగ్కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. దీంట్లో భాగంగానే అతడిని వాళ్లు హత్య చేసినట్టు వెల్లడైంది.