Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 16మంది మృతి- అసలేం జరిగింది?
Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ప్రయాగ్రాజ్కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం అవ్వడం, అనంతరం రైల్వే స్టేషన్లో భారీ రద్దీ నెలకొనడంతో కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగింది. న్యుదిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ తొక్కిసలాటలో 16మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట..
రైల్వేశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి 9:30 గంటలకు ప్లాట్ఫామ్ నెంబర్ 14,15 పై ఈ ఘటన జరిగింది. మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
కొద్దసేపటికే ప్యాసింజర్ల తాకిడి మరింత పెరగడంతో న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో అనేక మంది స్పృహకోల్పోయి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 16మంది మరణించగా, వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అనేకమంది గాయపడ్డారు.
సీట్లు ఉండవేమో అన్న భయంతో భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి రైళ్లల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఘటనాస్థలానికి పరుగులు తీసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు అగ్నిమాపక సిబ్బంది సైతం రైల్వే స్టేషన్కి చేరుకుని అధికారులకు సాయం చేసింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, 1500కిపైగా జనరల్ టికెట్లు విక్రయించడం ఈ రద్దీకి కారణం అని తెలుస్తోంది!
"ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెం. 14పైకి వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్ఫామ్పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైళ్లు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్ఫాం నెం. 12,13,14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కిపైగా జనరల్ టికెట్లు విక్రయించినట్టు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, నియంత్రించలేని విధంగా మారినట్టు సమాచారం," అని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యమే కారణమా?
న్యూదిల్లీ తొక్కిసలాట ఘటనపై హై లెవల్ కమిటీ దర్యాప్తు చేపట్టినట్టు రైల్వేశాఖ వెల్లడించింది.
దిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఎల్ఎన్జీపీ హాస్పిటల్ని సందర్శించి, తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
"న్యూదిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట వార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఈ ఘటనలో ప్రాణాలు కల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. తొక్కిసలాటలో ప్రభావితమైన వారికి అధికారులు సాయం చేస్తున్నారు," అని ట్వీట్ చేశారు మోదీ.
మరోవైపు న్యూదిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. దేశంతో పాటు యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆప్, కాంగ్రెస్లు ఆరోపించాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని, అందుకే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు.
మహా కుంభమేళాకు భారీ తాకిడి..
మహా కుంభమేళా 2025 నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, విమానాశ్రయాలు కిటకిటిలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.
ఫిబ్రవరి 14 నాటికి 50కోట్లకు పైగా మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి ప్రయాగ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లిన వారి సంఖ్య దాదాపు 3లక్షలకు చేరుకుంది.
కాగా శుక్రవారం ఒక్కరోజే ప్రయాగ్రాజ్ నుంచి 328 రైళ్లల్లో 10.47 లక్షల మంది ప్రయాణించారు.
సంబంధిత కథనం