Centre vs Delhi Govt: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి గొప్ప విజయం లభించింది. ఢిల్లీలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపై ఢిల్లీ ప్రభుత్వానిదే అధికారమని గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే కీలక అధికారాలు ఉండాలని సుప్రీంకోర్టు తేల్చింది. శాంతి, భద్రతలు (law and order), భూమి (land) వ్యవహారాలను మినహాయిస్తే, మిగతా అన్ని అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ తన కార్యనిర్వాహక పరిధిలో అధికారాలను ఉపయోగించవచ్చని పేర్కొంది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికే అధికారులపై నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. ఒక అధికారి తన ప్రభుత్వానికి జవాబుదారీగా లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తే.. బాధ్యతారాహిత్యానికి దారి తీస్తుందని హెచ్చరించింది. ఈ విషయంలో 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పుపై తాము విబేధిస్తున్నట్లు జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్రం, రాష్ట్రాలకు సముచిత అధికారాలను కల్పించే సమాఖ్య విధానం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోని మౌలిక నిర్మాణాల్లో ఒకటని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోని అధికార వ్యవస్థపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఉంటుందా? లేక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ (lieutenant governor) కు ఉంటుందా? అన్న వివాదానికి సంబంధించి సుప్రీం తీర్పు ఈ తీర్పును వెలువరించింది.