Delhi crime : నెత్తురోడిన దిల్లీ వీధులు- ఇద్దరిని పొడిచి, పొడిచి చంపిన ఐదుగురు మైనర్లు!-delhi crime group of minors kills 2 people in rampage during birthday revelry ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Crime : నెత్తురోడిన దిల్లీ వీధులు- ఇద్దరిని పొడిచి, పొడిచి చంపిన ఐదుగురు మైనర్లు!

Delhi crime : నెత్తురోడిన దిల్లీ వీధులు- ఇద్దరిని పొడిచి, పొడిచి చంపిన ఐదుగురు మైనర్లు!

Sharath Chitturi HT Telugu

దిల్లీ వీధులు రక్తమోడాయి! ఐదుగురు మైనర్లు మద్యం తాగి విధ్వంసం సృష్టించారు. గంట వ్యవధిలో రెండు వేరువేరు చోట్ల, ఇద్దరిపై దాడి చేసి, పొడిచి పొడిచి చంపారు. వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరిని హత్య చేసిన మైనర్లు!

దిల్లీలో అత్యంత దారుణ, ఆందోళనకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులను ఐదుగురు మైనర్లు కత్తులతో పొడిచి, పొడిచి చంపేశారు. బర్త్​డే పార్టీలో మద్యం తాగిన అనంతరం రెండు వేరువేరు చోట్ల ఈ దారుణాలకు ఒడిగట్టారు. ఫలితంగా దేశ రాజధానిలో విపరీతంగా పెరిగిపోతున్న ‘మైనర్ల నేరాల’పై సర్వత్రా ఆందోళనలు పెరిగాయి.

అసలేం జరిగింది?

ఘాజీపూర్​ పేపర్​ మార్కెట్​కి సమీపంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. నిందితులందరు 14ఏళ్ల నుంచి 17ఏళ్లలోపు వారే! బుధవారం రాత్రి వేళ వీరు మద్యం తాగుతూ బర్త్​డే పార్టీ చేసుకున్నారు. ఇక్కడే మార్కెట్​లో గుడ్ల బండి నడుపుతున్న రమేష్ దాతారామ్ బహిరంగంగా అబ్బాయిలు మద్యం సేవించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి వారితో వాగ్వాదానికి దిగాడు.

వాగ్వాదం తీవ్రం కావడంతో కత్తితో వచ్చిన మైనర్లు ఆ 49 ఏళ్ల వ్యక్తిని పొడిచి చంపేశారు.

బాలురు అతని మృతదేహాన్ని మార్కెట్​లోనే వదిలేసి, ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ స్ట్రీట్ పార్టీని కొనసాగించారు. అనంతరం న్యూ అశోక్ నగర్ వైపు నడుస్తూ మద్యం సేవించారు.

మొదటి హత్య జరిగిన సుమారు గంట తర్వాత ఆ మైనరలు దల్లుపుర రోడ్డులోని జల్ బోర్డు ట్రీట్​మెంట్ ప్లాంట్​కు చేరుకున్నారు. ఆ సమయానికి వాళ్లకి ఆకలేసింది. తినడానికి ఏదైనా కావాలని ఆరాటపడ్డారు. కాని ఆహారం లేదా పానీయం కొనడానికి డబ్బు లేదు!

ఆ సమయంలోనే.. సాహిబాబాద్​లోని ఓ గ్రాఫిక్ డిజైన్ కంపెనీలో హెల్పర్​గా పనిచేస్తున్న బీహార్​లోని అర్రాకు చెందిన పప్పు ప్రసాద్ (30) దల్లుపురాలోని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. బాలురు అతని వద్దకు వెళ్లి డబ్బు అడిగారు. అతను దోపిడీ ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో, అతని ఛాతీపై పలుమార్లు పొడిచి చంపారు.

దల్లుపురా రోడ్డులోని జలమండలి ట్రీట్​మెంట్ ప్లాంట్ సమీపంలో మృతదేహం పడి ఉందని గురువారం తెల్లవారుజామున 1 గంట సమయంలో స్థానికుల నుంచి మొదటి కాల్ వచ్చిందని డిప్యూటీ పోలీసు కమిషనర్ (తూర్పు) అభిషేక్ ధనియా చెప్పారు.

రోడ్డుపై చాలా రక్తం కనిపించింది. మృతుడిని పలుమార్లు పొడిచారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దోపిడీ ప్రయత్నంలో ప్రసాద్ హత్యకు గురయ్యాడని ఈ కేసు గురించి తెలిసిన మరో సీనియర్ అధికారి తెలిపారు.

ఈ ముఠా చేసిన మొదటి హత్య ప్రసాద్ కాదని పోలీసులకు కొద్ది గంటల్లోనే తెలిసింది!

ఘాజీపూర్ పేపర్ మార్కెట్​లో గుడ్ల వ్యాపారి కుమారుడు సన్నీ దతారామ్ రాత్రంతా తండ్రి గురించే ఆందోళన చెందాడు. "అతను తిరిగి రాకపోవడంతో, నేను అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించాను, కాని అతను సమాధానం ఇవ్వలేదు. అతను మార్కెట్ సమీపంలో పడుకున్నాడని లేదా స్నేహితుడి ఇంటికి వెళ్లాడని నేను అనుకున్నాను," అని సన్నీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. “పొద్దున్నే.. పేపర్ మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణం సమీపంలో కనిపించాడు. అతని కాలు రక్తంతో నిండిపోయింది. ముఖంపై కూడా గాయాలు ఉన్నాయి,” అనిచెప్పాడు.

దతారామ్ మృతదేహం సుమారు 11 గంటల పాటు మద్యం దుకాణం వెనుక పడి ఉందని అధికారులు తెలిపారు.

ప్రసాద్ హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు దల్లుపురా ప్రాంతంలోని సీసీటీవీలు, ట్రాఫిక్ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా ఈ రెండు హత్యలు ఒకే గ్రూపుతో ముడిపడి ఉన్నాయని తేలింది. ప్రసాద్ హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే కొందరు బాలురు ఉన్నట్లు గుర్తించామని, సుమారు గంట ముందు దతారామ్ హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లోనూ అదే బృందం కనిపించిందని అధికారులు తెలిపారు.

ప్లాట్​ఫాంపై కూర్చున్న మృతుడిని (దాతారామ్) నిందితులు కొట్టిన దృశ్యాలను గుర్తించామని డీసీపీ ధనియా తెలిపారు. రెండు క్రైమ్ సీన్లను విశ్లేషించే క్రమంలో రెండు హత్యలు ఒకే గ్రూపు దుండగులే చేసినట్లు గుర్తించామన్నారు.

ఐదుగురు మైనర్లు అరెస్ట్​..

నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను పంపామని, గంటల వ్యవధిలోనే వారిని గుర్తించి పట్టుకున్నామని ధనియా తెలిపారు. వారు నగరం విడిచి పారిపోవాలని ప్లాన్ చేశారని అన్నారు. దాడులకు ఉపయోగించిన కత్తిని, నిందితుల ఇళ్ల నుంచి రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.