Delhi Stamped : ఒకటి కాదు- రెండు చోట్ల తొక్కిసలాట! నరకం చూసిన ప్రజలు- ప్లాట్ఫామ్పై భయానక దృశ్యాలు..
New Delhi station stampede: న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సమయంలో ప్రజలు నరకం చూసినట్టు స్పష్టమవుతోంది. మొత్తం రెండు చోట్ల తొక్కిసలాట జరిగినట్టు సమాచారం.

మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వస్తున్న వార్తలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లు ఆలస్యమవ్వడంతో మొదలైన గందరగోళం.. చివరికి తొక్కిసలాటకు దారితీయగా, ఈ ఘటనలో 18మంది మరణించారు. అయితే, ఒకటి కాదు.. రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట- కారణం ఏంటి?
మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్రయాణికులు శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. అయితే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైళ్లు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో అప్పటికే స్టేషన్లో ఉన్న స్వతంత్ర సేనానీ ఎక్స్ప్రెస్- భువనేశ్వర్ రాజధాని (ఇవి కూడా ప్రయాగ్రాజ్కు వెళతాయి) రైలు బయలుదేరడం ఆలస్యమైంది. ఫలితంగా ప్రయాణికులతో సంబంధిత ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయాయి.
"ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెం. 14పైకి వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్ఫామ్పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైళ్లు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్ఫాం నెం. 12,13,14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కిపైగా జనరల్ టికెట్లు విక్రయించినట్టు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, నియంత్రించలేని విధంగా మారినట్టు సమాచారం," అని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు."
ప్లాట్ఫామ్ నెం14 దగ్గర, ప్లాట్ఫామ్ నెం.16కు సమీపంలోని ఎలివేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలు జరిగాయని మల్హోత్రా వెల్లడించారు.
"రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్లాట్ఫామ్ నెం.14, 15 దగ్గర ఉన్న మెట్లను బ్లాక్ చేశారు. కానీ రైళ్లు రావడం మరింత ఆలస్యమైంది. మెట్ల దగ్గర ప్యాసింజర్ల తాకిడి పెరిగింది. చివరికి మెట్లపైకి ప్రయాణికులు ఒకరిని, ఒకరు తోసుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో గందరగోళం నెలకొంది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు," అని ఓ అధికారి వెల్లడించారు.
అయితే 1500కిపైగా జనరల్ టికెట్లు విక్రయించినట్టు, స్టేషన్ లోపల రద్దీ పెరగడానికి ఇదీ ఒక కారణమని తెలుస్తోంది.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన 18మంది మరణించిన ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.
'ప్రయత్నించాము.. కానీ!'
శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట సమయంలో ఘటనాస్థలం వద్ద రద్దీని అదుపు చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ఇండియన్ ఎయిర్ఫోర్స్ సర్జెంట్ తెలిపారు. కానీ ఎవరూ తమ మాట వినలేదని వివరించారు.
"రైల్వే స్టేషన్లో ట్రై-సర్వీస్ ఆఫీస్ ఉంది. నా డ్యూటీ ముగించుకుని తిరిగి వెళుతుండగా రద్దీని చూశాను. మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్యాసింజర్లు వచ్చారు. ఒక చోట గుమిగూడవద్దని ప్రజలకు చెప్పాను. అనౌన్స్మెంట్స్ కూడా చేశాను. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేదుకు మా టీమ్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించింది. గాయపడిన వారికి నేను సాయం చేశాను," అని ఆ ఆఫీసర్ వెల్లడించారు.
మరోవైపు ఇలాంటి రద్దీని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్లాట్ఫామ్లు, రైళ్లు, బ్రిడ్జ్లు, మెట్లు, ఎలివేటర్లు.. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారని పేర్కొన్నారు.
భయానక దృశ్యాలు!
మరోవైపు న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట అనంతర దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్లాట్ఫామ్లు, మెట్లు, ఎలివేటర్ల వద్ద చెప్పులు, సంచులు, బ్యాగులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తొక్కిసలాట వల్ల చాలా మంది తప్పిపోయారు. 12మంది కుటుంబసభ్యులతో వెళ్లిన ఓ వ్యక్తి, ఈ తొక్కిసలాటలో తన సోదరిని కోల్పోయాడు. పరిస్థితి అదుపులోకి వచ్చిన ఆరగంట తర్వాత, ఆమె మృతదేహం అతనికి కనిపించింది.
సంబంధిత కథనం