2024లో భారత్ సైనిక వ్యయం పాకిస్తాన్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువని, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ఆయుధాలపై ప్రపంచ వ్యయం అత్యంత వేగంగా పెరుగుతోందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (Sipri) సోమవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.
భారత్ సైనిక వ్యయం 2024 లో అంతకుముందు సంవత్సరం కన్నా 1.6 శాతం పెరిగి 86.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనికి భిన్నంగా 2024 లో పాకిస్థాన్ రక్షణ రంగంపై చేసిన వ్యయం 10.2 బిలియన్ డాలర్లు మాత్రమే. 'భారత్ రక్షణ రంగంపై చేసిన వ్యయం 2015తో పోలిస్తే 42 శాతం పెరిగిందని 'ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్ పెండిచర్ 2024' పేరుతో విడుదల చేసిన నివేదికలో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా, సైనిక వ్యయం 2024 లో 2718 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2023 తో పోలిస్తే 9.4% పెరిగింది. అలాగే, 1988 తరువాత ఒక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సైనిక వ్యయం పెరిగింది. ముఖ్యంగా ఐరోపా, పశ్చిమాసియా ప్రాంతాలలో రక్షణ రంగ వ్యయం భారీగా పెరిగింది.
అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్ దేశాలు 1635 బిలియన్ డాలర్లతో ప్రపంచ మొత్తంలో 60 శాతం మిలిటరీ వ్యయం చేస్తున్నాయని నివేదిక తెలిపింది. 2015 నుంచి 2024 మధ్య కాలంలో ప్రతి ఏటా ఖర్చులు 37 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది.
చైనా సైనిక వ్యయం 2024 లో 7 శాతం పెరిగి 314 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇది మూడు దశాబ్దాల వరుస వృద్ధిని సూచిస్తుందని అధ్యయనం పేర్కొంది. ఆసియా, ఓషియానియాలోని మొత్తం సైనిక వ్యయంలో చైనా వాటా సుమారు 50% గా ఉందని, సైనిక ఆధునీకరణ, సైబర్ వార్ ఫేర్ సామర్థ్యాల పెంపు, అణ్వాయుధాల విస్తరణ తదితరాల కోసం చైనా భారీగా పెట్టుబడి పెట్టిందని నివేదిక తెలిపింది.
గత వారం కశ్మీర్ లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడిన నేపథ్యంలో భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ నివేదిక వెలువడింది. ఈ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన భారత్, పాక్ తో 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారీ చెక్ పోస్టును మూసివేయడం వంటి కఠిన చర్యలను గతవారం ప్రకటించింది.
సంబంధిత కథనం