IIT Student ends his life: ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఖరగ్ పూర్ లో సంచలనం సృష్టించింది. ఐఐటీ ఖరగ్ పూర్ లో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ రూమ్ లో విగత జీవిగా కనిపించాడు.
ఐఐటీ క్యాంపస్ ల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, అస్సాంలోని ప్రతిష్టాత్మక ఖరగ్ పూర్ ఐఐటీ క్యాంపస్ లో మరో విద్యార్థి చనిపోయాడు.
ట్రెండింగ్ వార్తలు
హాస్టల్ గదిలో..
ఖరగ్ పూర్ ఐఐటీ లో మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల ఫైజన్ అహ్మద్ శుక్రవారం తను ఉంటున్న హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించాడు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో, చనిపోయి రెండు, మూడు రోజులై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైజన్ ఇటీవలనే హాస్టల్ గదిలోకి మారాడని అధికారులు తెలిపారు.
అస్సాం వాస్తవ్యుడే..
ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థి ఫైజన్ అస్సాంలోని టిన్సుకియాకు చెందిన వాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడని, ఎలాంటి దురలవాట్లు లేవని తల్లిదండ్రులు తెలిపారు. చేతికంది వస్తాడనుకున్న కొడుకును శవంగా చూడాల్సి వస్తుందని అనుకోలేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
సీఎం సంతాపం
అస్సాం విద్యార్థి ఫైజన్ మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సంతాపం వ్యక్తం చేశారు. ఐఐటీ క్యాంపస్ ల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత నెలలో వేర్వేరు క్యాంపస్ ల్లో చదువుతున్న ఇద్దరు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబర్ 15న ఐఐటీ మద్రాస్ లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి, సెప్టెంబర్ 17న గువాహటి క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద తీరులో మృతి చెందారు. వారి వద్ద ఎలాంటి సూయిసైడ్ నోట్ లభించలేదు.