Debate on price rise : ధరల పెరుగుదలపై నిర్మల వివరణ.. కాంగ్రెస్ వాకౌట్
Debate on price rise : ధరల పెరుగుదలపై లోక్సభలో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం చర్చ జరిగింది. ఈ విషయంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఆమె మాటలతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ ఎంపీలు.. వాకౌట్ చేశారు.
Debate on price rise : భారత దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే అవకాశమే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఈ మేరకు ధరల పెరుగుదలపై లోక్సభలో ఆమె ప్రసంగించారు. నిర్మల ప్రసంగంపై అసహనం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
'అంతా బాగానే ఉంది..'
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ధరల పెరుగుదల సమస్యపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్సభ అనేకమార్లు అట్టుడికింది. ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరికి.. సోమవారం సాయంత్రం.. ధరల పెరుగుదలపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.
"ఇటీవలి కాలంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. కొవిడ్, ఒమిక్రాన్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇన్ని గడ్డు పరిస్థితుల్లోనూ.. భారత దేశంలో ద్రవ్యోల్బణం 7శాతం మించకుండా చూసుకుంది ఈ ప్రభుత్వం. ఈ విషయాన్ని అందరు గుర్తించాలి. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 7శాతంగా ఉంది. యూపీఏ పాలనలో.. అంటే 2004-2014 మధ్య.. ద్రవ్యోల్బణం రెండంకెలుగా కూడా ఉండేది. వరుసగా 22నెలల పాటు ద్రవ్యోల్బణం 9శాతం కన్నా ఎక్కువే ఉంది," అని నిర్మలా సీతారామన్ వివరించారు.
Parliament monsoon session : "డేటా పరంగా చూస్తే.. దేశంలో అంతా బాగానే ఉంది. ఇతర దేశాల కన్నా భారత్ ముందుంది. ఇప్పటికీ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియానే. కానీ ఈ వ్యవహారంపై కొందరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఈ విషయంపై 30మంది ఎంపీలు మాట్లాడారు. వారందరు డేటాను కాకుండా.. రాజకీయ కోణంలోనే ప్రసంగించారు," అని విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు కేంద్రం ఆర్థికమంత్రి.
విపక్షాల నిరసన..
- ధరల పెరుగుదలపై నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ ఎంపీలు.. సభ నుంచి బయటకు వాకౌట్ చేశారు.
- అంతకుముందు.. జీఎస్టీతో పెన్సిల్- స్టేషనరీ వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, ఓ విద్యార్థి.. రాసిన లేఖను ప్రస్తావించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే. దేశంలో పరిస్థితి ఇలా ఉందని వ్యాఖ్యానించారు.
- తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోష్.. మరో అడుగు ముందుకేసి కేంద్రంపై వినూత్నంగా నిరసన తెలిపారు. సభలోకి వంకాయను తీసుకొచ్చి, తన ప్రసంగం మధ్యలో దానిని కొరికారు. "ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఇదే కొనసాగితే..ఇలా పచ్చి కూరగాయలే తినాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఇదే కావాలా?" అని ప్రశ్నించారు.
తిరిగొచ్చిన ఎంపీలు..
తీవ్ర నిరసనల మధ్య గత వారం.. నలుగురు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. కాగా.. వారిపై ఉన్న సస్పెన్షన్ను సోమవారం ఎత్తివేశారు.
సంబంధిత కథనం